TDP: పోలీసుల దిగ్బంధంలో టీడీపీ కేంద్ర కార్యాలయం: మంగళగిరిలో ఉద్రిక్తత: బైక్ ర్యాలీ..!
గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఆదివారం పోలీసులతో నిండిపోయింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధించారు. కేంద్ర కార్యాలయం వద్దే సుమారు 50 మందికి పైగా పోలీసులు చుట్టుముట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న నాయకులను బయటికి రాకుండా అడ్డుకోవడానికి వారిని మోహరింపజేశారు. పోలీసు రోప్ పార్టీని సన్నద్ధం చేశారు. నాయకులను అరెస్టు చేయాల్సిన పరిస్థితే వస్తే.. వారిని తరలించడానికి ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు.
Jana Sena: నీది మనిషి పుట్టుకేనా?: పోలీసులను పక్కన పెట్టు..కొట్టుకుందాం: వైసీపీ ఎమ్మెల్యేకు సవాల్..!
పల్నాడులో పర్యటించనున్న చంద్రబాబు
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు కొద్దిరోజులుగా ప్రదర్శనలు, ఆందోళనలు, బైఠాయింపులను నిర్వహిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటోంది. ఇందులో భాగంగా- పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో పర్యటించాలని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీని చేపట్టనున్నారు.
అనుమతి లేదంటోన్న పోలీసులు..
చంద్రబాబు నాయుడి పల్నాడు ప్రాంత పర్యటనకు గానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల బైక్ ర్యాలీకి గానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇదివరకే టీడీపీ నాయకులు పంపించిన ప్రతిపాదనలను జిల్లా ఎస్పీ కార్యాలయం అధికారులు తిరస్కరించారు. మంగళగిరి సహా అమరావతి పరిధిలోని గ్రామాల్లో సెక్షన్ 144ను విధించిన నేపథ్యంలో ఈ రెండింటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
బైక్ ర్యాలీ నిర్వహణకే టీడీపీ మొగ్గు..
అయినప్పటికీ.. చంద్రబాబు పల్నాడు ప్రాంతంలో పర్యటించి తీరుతారని, తాము బైక్ ర్యాలీని నిర్వహిస్తామని తెలుగుదేశం నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఉదయం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏ క్షణమైనా వారు బైక్ ర్యాలీని నిర్వహించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేశారు.
ప్రజా ప్రభుత్వమా? పోలీసుల రాజ్యమా?
మంగళగిరి సహా, అమరావతి పరిధిలోని గ్రామాల్లో పెద్ద ఎత్తన పోలీసులను మోహరింపజేయడం, వారితో కవాతు నిర్వహించడం వంటి చర్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. అసహనానికి గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం లేదని, పోలీసుల రాజ్యం నడుస్తోందని మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకునే వారిని, ప్రశ్నించే వారిని ప్రభుత్వం పోలీసుల సహకారంతో జైలుపాలు చేస్తోందని ధ్వజమెత్తుతున్నారు.
జేఏసీ నేతలతో కలిసి..
మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పల్నాడు ప్రాంతంలో నిర్వహించ తలపెట్టిన ఉద్యమాన్ని విజయవంతం చేయాలంటూ టీడీపీ నాయకులు పిలుపునిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు అమరావతి ఉద్యమంలో పాల్గొనాలని గుంటూరు జిల్లా ఐక్య కార్యాచరణ సమితి నాయకులు కోరారు. నర్సరావుపేటలో చంద్రబాబు పాదయాత్ర, సభకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని, దీనికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.