పవన్ కళ్యాణ్! ఒప్పించు: నారాయణ, వారికోసం రాజధాని ఆగదు: రావెల
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన ఏపీ మంత్రులు, టిడిపి నేతలు ఆదివారం స్పందించారు. రెండు మూడు గ్రామాల కోసం రాజధాని ఆగదని మంత్రి పత్తిపాటి పుల్లారావు కుండబద్దలు కొట్టారు. పవన్ కళ్యాణ్ రైతులను ఒప్పించాలని మంత్రి నారాయణ సూచించారు.
రాజధాని నిర్మాణం ఆగదు: రావెల, పల్లె
ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చేలా రైతులను పవన్ కళ్యాణ్ ఒప్పించాలని మంత్రి రావెల కిషోర్ విశాఖలో కోరారు. లేని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రాజధాని నిర్మాణంలో పవన్ కూడా భాగస్వామి కావాలన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పేదే, తాము చెబుతున్నామన్నారు.
భూసేకరణ విషయంలో పవన్ సహకరించాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోరారు. పవన్తో పాటు ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే కోరుకుంటోందన్నారు. రాజధాని అందరికీ అవసరం కాబట్టి ఆయనే చొరవ తీసుకొని రైతులను ఒప్పించి, రాజధానికి భూములు ఇప్పించి నిర్మాణానికి సహకరించాలన్నారు.
ఆయన రైతులను ఒప్పిస్తే అందరూ హర్షిస్తారన్నారు. కోట్లాది మనోభావాలను దృష్టిలో ఉంచుకొని అందరి ప్రయోజనాల కోసం భూసేకరణకు తోడ్పాటు అందించాలన్నారు. రైతులకు పంట నష్టం పరిహారంతో పాటు వారి పిల్లలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఒప్పించాలి: నారాయణ
అమరావతి నిర్మాణానికి భూములు ఇవ్వని రూతుల నుంచి భూములు ఇప్పించాలని మీడియా ద్వారా పవన్ను కోరుతున్నామని మంత్రి నారాయణ చెప్పారు.
రాజధాని కోసం రైతులను ఒప్పించి 33 వేల ఎకరాల భూములను సేకరించామని, ఇంకా 2,200 ఎకరాలు అవసరమన్నారు. రైతులు భూమిని ఇవ్వనందునే భూసేకరణ చట్టం ద్వారా ప్రకటన ఇచ్చినట్లు తెలిపారు.
రాజధాని ఆగదు: పత్తిపాటి
రెండు మూడు గ్రామాల కోసం రాష్ట్ర రాజధాని నిర్మాణం ఆగదని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. 33వేల ఎకరాలను రైతులు స్వచ్చంధంగా, సంతోషంగా సీఎం చంద్రబాబుపై నమ్మకంతో ఇచ్చారన్నారు. రెండు మూడు గ్రామాల రైతులు తమకు నష్టం జరుగుతుందనే భావనతో పవన్ను కలిసి ఉండవచ్చునని, 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులు కూడా పవన్ను కలుస్తారన్నారు.