అమరావతి రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు, రాజధానిలో బ్రిక్స్ పార్క్
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు రేపటి నుంచి (సోమవారం) ప్లాట్లను సీఆర్డీఏ పంపిణీ చేయనుంది. ఈ నెల 20 నుంచి అధికారులు ప్లాట్లు కేటాయిస్తారు. రాజధానికి భూములిచ్చేందుకు మొదట ముందుకొచ్చిన నేలపాడు గ్రామ ప్రజల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమౌతుంది.
ఈ ప్లాట్లను లాటరీ పధ్ధతిలో కేటాయిస్తామని అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు నేలపాడులోని సీఆర్డీయే కార్యాలయానికి భూములిచ్చిన రైతులు చేరుకోవాలని వారు సూచించారు. గ్రామ రైతుల సమక్షంలో లాటరీ పద్ధతిలో స్థలాలు కేటాయించనున్నారు.
ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లకు ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలు కేటాయించేందుకు అనుసరించే రేండమ్ విధానాన్నే స్థలాల కేటాయింపుకు కడా వినియోగిస్తారు. ఒక రైతు ఒకే వైశాల్యం గల స్థలాలు రెండు మూడు కోరుకుంటే అవన్నీ పక్కపక్కనే వచ్చేలా ఇస్తారు.
తమకు ఏ వైశాల్యం గల స్థలాలు ఎన్ని కావాలో చెబుతూ ఇప్పటికే రైతులు సీఆర్డీఏకు దరఖాస్తులు అందించారు. దాని ఆధారంగా నేలపాడు గ్రామానికి సంబంధించిన తుది లే అవుట్ రూపొందించారు. మొత్తం లాటరీ ప్రక్రియ కొన్ని నిమిషాల్లోనే పూర్తి కానుంది. ఆ తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అందిస్తారు.
రైతులకు లాటరీ ద్వారా స్థలాలు కేటాయించిన తర్వాత మూడు వారాల్లోగా లే అవుట్లో మార్కింగ్ చేసి ఎవరి స్థలం ఎక్కడ ఉందో చూపిస్తారు అప్పుడు రైతులకు తుది యాజమాన్య హక్కు పత్రాలు అందిస్తారు. ఆ లోగా రైతులు తమ భూములకు సంబంధించిన అసలు పత్రాలు సీఆర్డీఏకు ఇవ్వాలి. రైతులు తమ భూములను సీఆర్డీఏ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే, రైతులకు ఇచ్చిన స్థలాల్ని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు.
అమరావతిలో బ్రిక్స్ పెట్టుబడి పార్కు!
ఏపీలో బ్రిక్స్ పెట్టుబడి పార్కు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. సుస్థిర పట్టణ ప్రాజెక్టు చేపట్టేందుకు బ్రిక్స్ బ్యాంకు నుంచి దాదాపు రూ.నాలుగు వేల కోట్లు రుణంగా తీసుకునే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మొత్తంతో ఒకే ప్రాజెక్టు చేపడతారు. ఇది అమరావతిలో ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.