ఫరూక్ అబ్దుల్లాకు చంద్రబాబు ఓదార్పు లేదేంటి: నాడు టీడీపీ విజయం కోసం మండుటెండల్లో ..!
ఫరూక్ అబ్డుల్లా. జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. నేషనల్ కాన్ఫిరెన్స్ అధినేత. రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా సంచ లనం సృష్టిస్తున్న జమ్ము కాశ్మీర్ విభజన..ఆర్టికల్ 370 రద్దు విషయంలో హౌస్ అరెస్ట్ అయ్యారు. ఆయన గురించి లోక్ సభలోనూ చర్చ సాగింది. అయితే, ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు ఎక్కడ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా..జాతీయ నేతల లిస్టులో హాజరయ్యే తొలి నేత. అటువంటి ఫరూక్ అబ్దుల్లా కేంద్రం తన మీద కక్ష్య సాధిస్తోందని..తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి..తనకు అన్ని సమయా ల్లో అండగా నిలిచిన ఆ పెద్దాయనను చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఓదార్పు ఇవ్వటం లేదు..కనీసం ట్విట్టర్ ద్వారా అయినా ఎందుకు తన సందేశం ఇవ్వలేదనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.
చంద్రబాబు ఆప్తుడు ఫరూక్ అబ్దుల్లా
నేషనల్ ఫ్రంట్ కాలం నుండి చంద్రబాబు ..ఫరూక్ అబ్దుల్లా రాజకీయంగా స్నేహితులు. జాతీయ స్థాయిలోనూ వారిద్దరూ కలిసి పని చేసారు. ఇక, గత అయిదేళ్ల కాలంలో చూస్తే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఎన్డీఏ నుం డి టీడీపీ బయటకు వచ్చిన తరువాత సమీకరణాలు పూర్తగా మారిపోయాయి. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి వ్యతిరేకం గా కూటమి కట్టటం కోసం చంద్రబాబు అనేక పార్టీల నేతలతో మంతనాలు చేసారు. ఫరూక్ అబ్దుల్లా సైతం చంద్రబాబు తో కలిసి నడిచారు. అటువంటి ఫరూక్ అబ్డుల్లా కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయాలకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం గృహ నిర్బంధం చేయటాన్ని నిరసిస్తూ తనకున్న భద్రతను సైతం కాదన్నారు. స్వీయ నిర్బంధం చేసుకొని నిరసన కొనసాగిస్తున్నారు. కేంద్రం మీద తీవ్ర ఆరోపణలు చేసారు. మరి..అంతటి ఆవేదనలో ఉన్న తన మిత్రుడుకి చంద్రబాబు ఓదార్పు కరువైంది. నేరుగా అక్కడకు వెళ్లే పరిస్థితి..మాట్లాడే పరిస్థితి లేకపోయినా..ట్టిట్టర్ ద్వారా కూడా ఓదార్పు ఇవ్వలేదు.
టీడీపీ గెలుపు కోసం మండుటెండల్లో సైతం..
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఫరూక్ అబ్దుల్లా మండుటెండల్లోనూ ప్రచారంలో పాల్గొన్నారు. కడపలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పర్యటించారు. అక్కడ వైసీపీ..టీడీపీ నుండి ముస్లిం అభ్యర్దులు పోటీలో ఉండటంతో ఫరూక్ను ప్రచారానికి తేవటం ద్వారా ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు ఆశించారు. అయితే, అక్కడ నిర్వహించిన సభకు జన స్పందనే లేదు. ఇక, అదే ఆలోచనతో కర్నూలు..నంద్యాల ప్రచార సభల్లోనూ ఫరూక్ ను తీసుకెళ్లారు. ఇక, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలోనూ ఫరూక్ అబ్దుల్లా పాల్గొని చంద్రబాబును ప్రశంసించారు. టీడీపీని గెలిపించాలని కోరారు. ఇక, ఢిల్లీలో ఏపీ భవన్ వేదికగా చంద్రబాబు చేసిన ధర్మ పోరాట దీక్షకు ఫరూక్ విచ్చేసి మద్దతు ప్రకటించారు. ఇంతగా..చంద్రబాబు ఆహ్వానించిన ప్రతీ కార్యక్రమంలోనూ ఫరూక్ పాల్గొన్నారు.
మోదీ ఆగ్రహానికి గురవుతామనా..
ఎన్నికల ముందు మోదీ పైన తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన చంద్రబాబు..ఎన్నికల ఫలితాల తరువాత మోదీ పేరు ఎత్తటం లేదు. ఇక, దాదాపుగా ప్రతీ అంశంలోనూ టీడీపీ కేంద్ర నిర్ణయాలకు మద్దతుగానే నిలుస్తోంది. టీడీపీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయినా చంద్రబాబు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. తలాక్ బిల్లు, ఆర్టీఐ చట్ట సవరణ.. జమ్ము కాశ్మీర్ విభజన బల్లు విషయంలోనూ బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితు ల్లో నేరుగా ఫరూక్ అబ్దుల్లాకు పరామర్శించినా..ఓదార్పు ఇచ్చినా ప్రధాని ఎక్కడ ఆగ్రహానికి గురవుతారో అనే కారణం తోనే చంద్రబాబు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.