కన్నతండ్రి కర్కశం:గర్భిణి కూతురుపై దాడి..గర్భంలోనే కవలలు మృతి
చిత్తూరు:మద్యం మత్తులో గర్భిణి అయిన కన్న కూతురిని కడుపుపై తన్నడంతో బలమైన దెబ్బ తగిలి గర్భంలోని కవల శిశువులు మృతి చెందిన దారుణ ఘటన ఇది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించి కవల మృతశిశువులను బయటికి తీశారు. ఈ ఘటన గురించి తెలిసి ఆస్పతి అంతటా విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బసినికొండకు చెందిన నరసింహులు, రమణయ్య కుమార్తె లక్ష్మీదేవికి గత ఏడాది ఇదే మండలంలోని ఓబులరెడ్డిపల్లె శివకుమార్తో వివాహం జరిగింది. లక్ష్మీదేవి ప్రస్తుతం గర్భవతి. అయితే భర్త తాగుడుకు బానిసై లక్ష్మీదేవిని వదిలేయడంతో ఆమె పుట్టింటికి వచ్చి ఉంటోంది. ఆ తరువాత తాగుబోతు భర్త మరో పెళ్లి చేసుకొని మొదటి భార్య అయిన లక్ష్మీదేవిని అసలు పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో న్యాయం జరగలేదు.
భర్తపై కేసు కూడా పెట్టిన నేపథ్యంలో ఆమె అప్పటి నుంచి తల్లిదండ్రులపైనే ఆధారపడి జీవిస్తోంది. ఈ క్రమంలో వారం క్రితం ఆమె తండ్రి నరసింహులు పూటుగా మద్యం తాగి వచ్చి భార్య రమణమ్మను విచక్షణా రహితంగా కొడుతుండటంతో కూతురు లక్ష్మీదేవి అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన తండ్రి గర్భిణి అని చూడకుండా కుమార్తె పొట్టపై కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. దీంతో విషయం తెలిసిన స్థానికులు బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆమె పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తిరుపతి రుయా ఆస్పత్రికి రిఫర్ చేశారు. రుయాలో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులోని కవలలు చనిపోయారని నిర్ధారించి శస్త్ర చికిత్స ద్వారా మృత శిశువులను బయటకు తీశారు. ప్రస్తుతం లక్ష్మీదేవి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్లు బాధితురాలి తల్లి రమణమ్మ తెలిపింది.