పోలీసుల అదుపులోకూతుర్ని చంపిన తండ్రి: కారణమిదే, 4ఏళ్లుగా సీనియర్ ప్రేమలో
విజయవాడ: కృష్ణా జిల్లాలో కూతురు చంద్రికను చంపిన తండ్రి కోటయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీనిని పరువు హత్యగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. తాను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని కూతురు చెప్పడంతో ఆవేశంలో తండ్రి చంపేశాడని తెలుస్తోంది.
ఫోన్లో మాట్లాడుతున్న కూతురును కొట్టి చంపేశాడు: ప్రేమించిందనే కొట్టాడు: తాత ఫిర్యాదు
కూతురును అతను గొడ్డలితో నరికి చంపేశాడు. చంద్రిక ఓ ప్రయివేటు కాలేజీలో బీఫార్మసీ చదివింది. రెండు నెలల క్రితమే ఆమె బీఫార్మసీ పూర్తయింది. రెండు రోజుల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె తన తల్లిదండ్రుల వద్ద తన ప్రేమ విషయం తెలిపింది. తాను అబ్బాయిని ఇష్టపడుతున్నానని, అతనిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
నిత్యం ఫోన్లో మాటలు, తోడు ప్రేమ విషయం
అయితే, గత రెండు నెలలుగా తన కూతురు చంద్రిక ఫోన్లో నిత్యం ఎవరితోనో మాట్లాతుండటాన్ని తండ్రి కోటయ్య గమనించాడు. దానికి తోడు రెండు రోజుల క్రితం తండ్రికి ప్రేమ విషయం చెప్పింది. ఈ కారణంగా రెండు మూడు రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. శనివారం ఉదయం కోటయ్య పొలం నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో చంద్రిక ఫోన్లో మాట్లాడుతోంది.
గొడ్డలితో తలపై మోదాడు
ఈ సమయంలో ఆవేశం కట్టలు తెంచుకున్న తండ్రి కోటయ్య తన చేతిలో ఉన్న గొడ్డలితో తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికి అక్కడే చనిపోయింది. ఇదంతా తల్లిముందే జరిగింది. పోలీసులు తండ్రి కోటయ్య ముందు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. దీనిని పోలీసులు పరువు హత్య కోణంలో విచారిస్తున్నారు.
కొద్ది రోజులుగా తండ్రీకూతుళ్ల మధ్య వాగ్వాదం
హత్యకు ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మృతి చెందిన చంద్రిక గత కొంతకాలంగా గోపి మనోహర్ అనే యువకుడిని ప్రేమిస్తోందని వార్తలు వస్తున్నాయి. అతనినే పెళ్లి చేసుకుంటానని ఆమె ఇటీవల తండ్రితో వాగ్వాదానికి దిగుతోందని తెలుస్తోంది. తాత రామారావు కూడా ప్రేమ వ్యవహారం కారణంగానే మనవరాలిని హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
యువకుడిని విచారించిన పోలీసులు
చంద్రిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారని తెలుస్తోంది. ఆమె ఫోన్లో మాట్లాడిన యువకుడిని పోలీసులు ప్రశ్నించగా.. తామిద్దరు ప్రేమించుకున్నట్లు తెలిపాడు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఈ సంఘటన జరిగిందన్నాడు. అయితే చంద్రిక కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. తల్లిదండ్రుల మధ్య గొడవలో వెళ్లడంతో జరిగిన పొరపాటు కారణంగా చంద్రిక చనిపోయిందని చెబుతున్నారు.
నాలుగేళ్లుగా అతనితో ప్రేమలో
తన సీనియర్ అయిన గోపితో నాలుగేళ్లుగా ఆమె ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో చంద్రిక, తనకు సీనియర్ అయిన గోపీ మనోహర్ అనే అతనిని ప్రేమించిందని తెలుస్తోంది. వారి ప్రేమ ఇంటర్ తర్వాత కూడా సాగిందని అంటున్నారు. గోపీ మనోహర్ను పోలీసులు విచారించారు. చదువులు పూర్తయ్యాయి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారు.