దారుణం:భార్య కాపురానికి రావడం లేదని...ముగ్గురు పిల్లల్ని నదిలో పడేసిన తండ్రి
చిత్తూరు:మద్యం మత్తుకు...హద్దుమీరిన ఆవేశం తోడైతే ఎంతటి అనర్థం చోటుచేసుకుంటుందో నిరూపించిన దారుణ ఘటన ఇది. అంతేకాదు కన్న తండ్రే చిన్నారుల పాలిట కాలయముడిగా మారిన ఉదంతమూ ఇదే...
భార్యపై కోపంతో అభంశుభం తెలియని పసివాళ్లను నదిలో పడేసి చంపేసిన ఓ కన్నతండ్రి కర్కశత్వం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ నిర్ఘాంతపోతున్నారు. ఈ దారుణం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం శెట్టిగారిపల్లెల్లో చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఆ తండ్రి తన కన్నబిడ్డల్నే కిరాతకంగా హతమార్చి పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే...
చిత్తూరు జిల్లా శెట్టిగారిపల్లెకి చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి దిగువపల్లికి చెందిన అమరావతి అనే మహిళతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు మగపిల్లలు సంతానం. అనంతర కాలంలో వెంకటేష్ తాగుడుకు బానిసవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వెంకటేష్ భార్య అమరావతి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే భార్యను తిరిగి కాపురానికి రావాలని భర్త వెంకటేష్ కోరాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన వెంకటేష్ సోమవారం రాత్రి తన ముగ్గురు పిల్లలను తీసుకుని వెళ్లి నీవా నదిలో పడేశాడు. ఆ తరువాత అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో ముగ్గురు చిన్నారులు పునీత్(5), సంజయ్(3), రాహుల్(2)గా నదిలో మునిగి చనిపోయారు.
మద్యం మత్తులో వెంకటేష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భార్యతో గొడవపడి అన్నెంపున్నెం ఎరుగని చిన్నరులను కన్న తండ్రే దారుణంగా చంపేయడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వెంకటేష్ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.