సంక్రాంతికి ఇంటికొచ్చిన కూతురిపై కన్నతండ్రి అఘాయిత్యం.. పదేపదే రేప్ చేయడంతో భరించలేక..
హాస్టల్లో చదువుకునే పిల్లలకు సెలవులొస్తే ఎగిరిగంతేస్తారు. కానీ ఈ పాపకు మాత్రం ఇంటికెళ్లాలంటేనే భయం. అలాగని ఒంటరిగా హాస్టల్ లో గడిపే వీలు కూడా లేదు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. నా అనేవాళ్లెవరూ తనను దగ్గరికి తీసుకోరు.. గత్యంతరంలేని పరిస్థితుల్లో ప్రతిసారి బాధతోనే కదిలేది. ప్రస్తుత సంక్రాంతి సెలవులకు కూడా అలానే ఇంటికొచ్చింది. కన్నకూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె పాలిట కీచకుడయ్యాడు.
రెండేళ్లుగా దారుణం..
తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన కీచక తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయవరం పోలీసుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక తల్లి మరణించడంతో హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. రెండేళ్ల కిందట ఇలాగే సెలవుల టైమ్ లోనే ఆ చిన్నారిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి కూతురు ఇంటికొచ్చినప్పుడల్లా పశువాంఛ తీర్చుకుంటూ నరకం చూపించేవాడు.
వద్దన్నా వినకుండా..
సంక్రాంతి సెలవుల కోసం ఇంటికొచ్చిన కూతురిపై కీచక తండ్రి యధావిధిగా అఘాయిత్యానికి సిద్ధమయ్యాడు. ఆదివారం రాత్రి బాగా తాగొచ్చి కూతురిపై మరోసారి నీచానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి మళ్లీ అత్యాచారానికి యత్నించడంతో ఆ పాప భరించలేకపోయింది. తండ్రి నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీసింది. విషయం తెల్సుకున్న చుట్టుపక్కలవాళ్లు పాపను కాపాడి 100కు డయల్ చేశారు.
పోక్సో, దిశ చట్టాల కింద..
ఫిర్యాదు మేరకు గ్రామానికి చేరుకున్న పోలీసులు.. ప్రాధమిక విచారణ తర్వాత కీచక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. వాడిపై పోక్సో, దిశ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని రాయవరం పోలీసులు తెలిపారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి తొందరగా శిక్షలు పడాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రమంతటా రేప్ కేసులు నమోదవుతూనేఉన్నాయి.