ఆ కారణంతోనేనా?: కొడుకు పైనే అనుమానం.. టీడీపీ నేత కూతురి హత్య మిస్టరీ!
అదే కక్షతో తన కొడుకే తన కూతురిని హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
రామచంద్రాపురం: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఓ యువతి దారుణ హత్య సంచలనం రేకెత్తిస్తోంది. హత్యకు సంబంధించి కన్న కొడుకు పైనే అనుమానం వ్యక్తం చేశాడు తండ్రి. తన కొడుకే కుమార్తెను హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నాడు.
మరోవైపు ఆస్తుల తగాదా ఏమైనా హత్యకు దారితీసిందా? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. హత్యకు గురైంది టీడీపీ పట్టణ అధ్యక్షుడు నందుల సూర్యనారాయణ రాజు కుమార్తె కావడంతో జిల్లాలో ఇదో సంచలనంగా మారింది.
కుటుంబ నేపథ్యం:
టీడీపీ పట్టణ అధ్యక్షుడు నందుల సూర్యనారాయణ(రాజు)కు అమృతా బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. నారాయణకు జయదీపిక(20), జయప్రకాశ్నాయుడు అనే కవల పిల్లలు ఉన్నారు. జయదీపిక అగ్రహారం కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది.
Recommended Video
ఇలా వెలుగులోకి :
సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బార్లో పనిచేసే దుర్గసాయి కల్యాణ్ అనే వ్యక్తి నందుల రాజు ఇంటికి వెళ్లాడు. అప్పటికే జయదీపిక తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దీపికను అంబులెన్స్లో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ప్రేమ వ్యవహారమే కారణమా?:
కూతురి ప్రేమ వ్యవహారం గురించి ఇటీవల తన కొడుకు జయప్రకాశ్ నాయుడు తన వద్ద ప్రస్తావించాడని తండ్రి చెబుతున్నాడు. అదే కక్షతో తన కొడుకే తన కూతురిని హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తండ్రి ఫిర్యాదుతో సీఐ శ్రీధర్ కుమార్ కేసు నమోదు చేసుకున్నారు.
ఏంటీ మిస్టరీ:
నందుల రాజు కుటుంబంలో నెలకొన్న ఆస్తి తగాదాలే, హత్యకు దారి తీశాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు దీపిక హత్యపై పట్టణంలో చాలానే పుకార్లు వినిపించాయి. చివరకు తండ్రి నందుల రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు అందరినీ ఆశ్చర్యపరిచింది. అదీ కన్న కొడుకు పైనే ఆయన అనుమానం వ్యక్తం చేయడం మరింత సంచలనంగా మారింది. దర్యాప్తులో ఎటువంటి నిజాలు బయటపడుతాయో చూడాలి.