టవర్ ఎక్కిన ఫాతిమా విద్యార్థులు, దిగొచ్చిన బాబు ప్రభుత్వం: అసెంబ్లీ వద్ద కలవొచ్చు
పాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు న్యాయం కోసం ఆందోళన చేస్తున్నారు. 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.
విజయవాడ: పాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు న్యాయం కోసం ఆందోళన చేస్తున్నారు. 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.
తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అయిదుగురు విద్యార్థులు, ఓ విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కారు.
న్యాయం జరిగే వరకు పోరాటం
తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. తమకు న్యాయం కావాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
సుప్రీం కోర్టు తీర్పుపై విద్యార్థుల నిరాశ
సెల్టవర్ ఎక్కిన వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఫాతిమా కళాశాల అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు ఇటీవల వచ్చిన తీర్పుతో విద్యార్థులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
సుప్రీం తీర్పు తర్వాత
అప్పటి వరకు న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పు తర్వాత విద్యార్థుల విషయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంది. దీంతో విద్యార్థులు ధర్నాచౌక్ వద్ద దీక్షలు చేస్తున్నారు. వీరికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయి. దీక్షలు చేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని భావించిన విద్యార్థులు ఇప్పుడు సెల్ టవర్ ఎక్కారు.
అపాయింటుమెంట్ ఇచ్చిన చంద్రబాబు
మంత్రి కామినేని శ్రీనివాస రావు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు టవర్ దిగేది లేదని స్పష్టం చేశారు. కాగా, విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం దిగి వచ్చింది. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు వారికి అపాయింటుమెంట్ ఇచ్చారు. అసెంబ్లీ వద్ద తనను కలవాలని చెప్పారు. మరోవైపు, సుప్రీం తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫాతిమా మెడికల్ కాలేజీకి ఎంసీఐ గుర్తింపును రద్దు చేసింది. దీంతో వందమంది విద్యార్థులు రోడ్డున పడ్డారు.