టెట్ పరీక్షా?...లేక...అభ్యర్థులకు విషమ పరీక్షా?...
అమరావతి:ఉపాధ్యాయ అర్హత పరీక్ష...టెట్...నిర్వహణా ప్రసహనం...అక్షరాలా అభ్యర్థుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఏ క్షణాన ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకటించారో గానీ అప్పటినుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూ...ఎట్టకేలకు ఎగ్జామ్ తేదీ ఖరారైందని భావించేలోపులో...పరీక్షా కేంద్రాల కేటాయింపుల్లో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ అభ్యర్థుల్ని అల్లాడిస్తోంది. చివరకు ఈ టెట్ పరీక్ష తమ పాలిట విషమ పరీక్షగా మారిందని...ఇది ప్రభుత్వం తమ సహనానికి పెడుతున్న పరీక్షగా భావిస్తున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
మరో రెండు రోజుల్లో టెట్ తొలి పరీక్ష ప్రారంభం కానుంది. మరోవైపు ఈ పరీక్ష కోసం తమకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించిన కొందరు అభ్యర్థులు షాక్ కు గురవుతున్నారు...ఎందుకంటే...
మరో రెండు రోజుల్లోనే...టెట్ మొదలు...టెన్షన్ కూడా...
ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు జరుగనున్న టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4,46,833 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి సారిగా పరీక్షను విద్యాశాఖ ఆన్లైన్లో నిర్వహిస్తోంది. మొత్తం 183 కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. వీటిల్లో 159 కేంద్రాల్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయగా, 24 కేంద్రాల్ని ఇతర రాష్ట్రాల్లో కేటాయించింది. అయితే మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ టెట్ పరీక్షకు సంబంధించి విద్యాశాఖ దరఖాస్తు దశ నుంచి పరీక్ష కేంద్రాల కేటాయింపు వరకు తప్పుల మీద తప్పులు చేస్తూ అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. ఈ నెల 10 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యాశాఖ ప్రకటించినా సర్వర్ సమస్యతో అనుకున్న సమయానికి హాల్ టిక్కెట్లను వైబ్సైట్లో పొందుపరచలేకపోయింది. అభ్యర్థులు రెండు రోజులు ఆలస్యంగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలిగారు.
పరీక్షా కేంద్రాల కేటాయింపు...అసలు విషయం
తెలిసి...అభ్యర్థులు షాక్...టెట్ పరీక్ష కోసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను... ఒక జిల్లా అభ్యర్థికి అనేక జిల్లాల ఆవల మరో జిల్లాలో...అంతేకాదు కొందరు తాము కోరుకోకపోయినా ఏకంగా ఇతర రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్ ను కేటాయించడంతో దిగ్బ్రాంతి చెందారు. ఇలా అనేకమంది అభ్యర్థులకు సుదూర ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలు కేటాయించారు. బెంగళూరు, చెన్నై వంటి ఇతర రాష్ట్రాల రాజధానుల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడం జరిగింది. దీంతో వందల కిలోమీటర్ల దూరం లో ఉన్న కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు అనేక గంటలు ప్రయాణించాల్సి రావడం...ఒక రోజు ముందుగానే తప్పనిసరిగా ఆ ప్రాంతానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల వేలాది రూపాయలు ఖర్చు మాత్రమే కాకుండా ఎంతో రిజర్వేషన్లు దొరక్కపోవడం,చంటిబిడ్డలు, గర్భవతులు, దివ్యాంగులు, మహిళలు అంతదూరం వెళ్లి పరీక్ష రాసేందుకు ఎన్నోవ్యయప్రయాసలు పడాల్సివస్తోంది. అలాగే హాల్ టికెట్లలోనూ అనేక తప్పులు ముద్రించింది.
టెట్ అభ్యర్థులకు...మరికొన్ని షాక్ లు...
కొన్నిచోట్ల తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్నిచూసుకునేందుకు వెళ్లిన అభ్యర్థులు ఆ తరువాత అసలు విషయం తెలిసి ఖంగుతింటున్నారు.కారణం...అసలు మనుగడలో లేని కేంద్రాల్నిఅభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్స్ గా కేటాయించడమే. హాల్ టికెట్లలో తమకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ గురించి ముందు జాగ్రత్తగా తెలుసుకునేందుకు ప్రయత్నించిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు అసలు అవి అక్కడ లేనే లేవని తెలిసి ఖంగుతింటున్నారు. ఉదాహరణకు కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులకు కృష్ణచైతన్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. ఇది చిలకలూరిపేట రోడ్డు, కేశానుపల్లి పోస్టు, నరసరావుపేట, గుంటూరు జిల్లాలో ఉన్నట్లు హాల్ టికెట్లో పేర్కొన్నారు. వాస్తవంగా ఈ కళాశాల ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందోఅర్థం చేసుకోవచ్చు.
ప్రైవేట్ ఏజెన్సీకి అప్పజెప్పడమే...అదేనా కారణం...
డీఎస్సీ రాసే అభ్యర్థులు ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష...టెట్...రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారే డీఎస్సీ ఫైనల్ పరీక్షకు అర్హులవుతారు. ఇంతా కష్టపడితే డీఎస్సీ పోస్టు వస్తుందో రాదో తెలియదు గానీ అభ్యర్థులు మాత్రం నిజంగా విషమ పరీక్షే ఎదుర్కొంటున్నారు. అసలు టెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీకి అప్పజెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకోవడమే ఈ పరిస్థితికి కారణమని అభ్యర్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఏజెన్సీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల కేటాయింపుల వెనుక కుట్ర ఉందంటూ కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా పరీక్షకు ముందే ఇన్ని సమస్యలు ఎదురైతే ఇక పరీక్షా సమయంలో మరెన్నితిప్పలు పడాల్సివస్తుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.