ఏబీని వెంటాడుతున్న జగన్ సర్కార్-ముందస్తు బెయిల్ ప్రయత్నాలు-ఐపీఎస్లకు లేఖ
చంద్రబాబు హయాంలో జరిపిన భద్రతా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి మాజీ ఇంటిలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అరెస్టు తప్పేలా లేదు. ఈ వ్యవహారంలో తొలుత అభియోగాల నమోదు చేయకుండానే ఆయన్ను సస్పెండ్ చేసిన జగన్ సర్కార్.. కోర్టు అభ్యంతరాలతో తాజాగా ఆ ప్రక్రియను పూర్తి చేసింది. అయినా ఇప్పటికీ ఆయనకు పోస్టింగ్, జీతం ఇవ్వకుండా వేధిస్తోంది. ఇక ఈ కేసులో ఏబీని అరెస్టు చేసేందుకు కూడా పావులు కదుపుతోంది. దీంతో ఆయన ప్రభుత్వం అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును, తనను వేధిస్తోందంటూ ఐపీఎస్ అధికారుల సంఘాన్ని ఆశ్రయించారు.
ఏబీ వెంకటేశ్వరరావు అరెస్టు తథ్యం...
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ ఛీఫ్గా పనిచేస్తూ నిఘా అవసరాల కోసం భద్రతా పరికరాల కొనుగోళ్లు చేసిన వ్యవహారంలో అక్రమాలు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును వెంటాడుతున్నాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వ అండదండలతో ఈ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరించిన ఏబీని విపక్షంలో ఉండగానే వైసీపీ టార్గెట్ చేసేది. ఇక ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులు మొదలుపెట్టారు. భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాల కేసులో సస్పెండ్ చేయడమే కూడా జీతభత్యాలను సైతం ఆపేశారు. దీంతో ఆయన క్యాట్తో పాటు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఊరట పొందారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అభియోగాలను నమోదు చేసిన ప్రభుత్వం.. వీటిపై ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తి కరంగా లేదనే కారణంతో అరెస్టుకు సిద్దమవుతోంది.
యువ తార సందీప ధార్ బ్యూటిఫుల్ ఫోటోలు..
హైకోర్టును ముందస్తు బెయిల్ కోరిన ఏబీ
జగన్ సర్కారు తనను ఎట్టిపరిస్ధితుల్లోనూ అరెస్టు చేయబోతోందనే సమాచారంతో ఏబీ వెంకటేశ్వరరావు అప్రమత్తమయ్యారు. ఈ కేసులో తాను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో తనను ఇరికించిందని, తాను చేయని తప్పులకు బలి చేయాలని చూస్తోందని, అందుకే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైకోర్టులో ఊరట లభించకపోతే సుప్రీంను ఆశ్రయించేందుకు ఏబీ సిద్దమవుతున్నారు.
ప్రభుత్వ వేధింపులపై ఐపీఎస్ల సంఘానికి లేఖ
జగన్ ప్రభుత్వం తనను వేదింపులకు గురి చేస్తోందంటూ ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారుల సంఘాన్ని కూడా ఆశ్రయించారు. ఇంటిలిజెన్స్ ఛీఫ్ హోదాలో పని చేసిన తనను ప్రభుత్వం అన్ని రకాలుగా వేధిస్తోందంటూ ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారుల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. త్వరలో క్రిమినల్ కేసుపెట్టి జ్యూడిషియల్ రిమాండ్కు పంపి.. మళ్లీ సస్పెన్షన్ విధించాలని కుట్ర ప్రభుత్వం పన్నుతోందంటూ ఆయన ఈ లేఖలో ఆరోపించారు. ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఇప్పటికే నెలల తరబడి తనను ఉద్యోగం చేయనీయకుండా, జీతం ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఏబీ పేర్కొన్నారు. వెంటనే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ ఏర్పాటు చేస్తే అన్ని విషయాలను ఆధారాలతో సహా వివరిస్తానని, నిష్పక్షపాత విచారణ జరగాలన్నది తన డిమాండ్ అని వెంకటేశ్వరరావు ఆ లేఖలో తెలిపారు.