రాత్రయితే చాలు గ్రామాల్లో వణుకు?, బలవతున్న అమాయకులు: పోలీసుల గట్టి హెచ్చరిక..
గుంటూరు: రాత్రయితే చాలు.. పల్లెలు భయంతో వణికిపోతున్నాయి. కర్రలు పట్టుకుని చిన్నా పెద్దా గ్రామంలో గస్తీ కాస్తున్నారు. పిల్లలను ఎత్తుకుపోతారంటా.. గుండెలు కిడ్నీలు పట్టుకుపోతారంట.. అంటూ అంతా చెవులు కొరుక్కుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇప్పుడెక్కడ చూసిన ఇదే పుకారు జోరుగా వినిపిస్తోంది. ఈ పుకార్ల కారణంగా గ్రామస్తుల చేతిలో అమాయకులు బలైపోతున్న పరిస్థితి.
వదంతులను నమ్మి దాడులు..:
పార్థీ గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్.. ఇలా రకరకాల గ్యాంగుల పేరుతో సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. పలానా గ్రామంలో నిన్న ఇద్దరిని చంపారంట.. పలానా చోట ఒకరిని ఎత్తుకెళ్లారంట అంటూ వదంతులు సృష్టిస్తున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ ల ద్వారా వైరల్ అవుతున్న ఈ ప్రచారం గ్రామాలను తీవ్రంగా ప్రభావం చేస్తోంది. నిజానిజాలను నిర్దారించుకోకుండా.. చాలా గ్రామాల ప్రజలు వీటిని నిజమే అనే నమ్ముతున్నారు.
బలవుతున్న అమాయకులు:
గ్రామాల్లోకి ముఠాలు చొరబడుతున్నాయన్న ప్రచారంతో.. రాత్రుళ్లు నిద్రాహారాలు మాని మరీ స్థానికులు గస్తీ కాస్తున్నారు. కొత్తవాళ్లు కనపడ్డా.. ఎవరైనా హిందీలో మాట్లాడినా.. ముఠా సభ్యులే అన్న అనుమానంతో వారిని చావబాదుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల్లో అమాయకులు బలైపోయారు. విచక్షణారహితంగా వారిపై దాడి చేసి కొట్టి చంపారు.
ఏ గ్యాంగులు చొరబడలేదు:
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు ఈ వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోకి ఎలాంటి గ్యాంగులు చొరబడలేదని ఇదివరకే తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు అనవసర భయాలు, అపోహల నుంచి బయటకు రావాలని, తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీ హోం శాఖ కూడా దీనిపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.
మాచర్లలో దాడి:
ఓవైపు వదంతులను నమ్మవద్దని పోలీసులు చెబుతూనే ఉన్నారు.. గ్రామీణ ప్రజలు మాత్రం వదంతుల నుంచి బయటపడటం లేదు. ఆ ఊళ్లో అలా చేశారట.. ఈ ఊళ్లో ఇంత బీభత్సం సృష్టించారట అన్న వదంతులను ఇంకా కొంతమంది నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా మాచర్ల మండలం అలుగురాజుపల్లిలో ఓ వ్యక్తి అర్థరాత్రి వేళ ఊళ్లో దిగడంతో అతనిపై రాళ్ల దాడి జరిగింది. నిజానికి అతను ఆ ఊళ్లోనే ఒకింటికి చెందిన అల్లుడు. అదేది తెలుసుకోకుండా అతనిపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు.
జైలుకే అని పోలీసుల హెచ్చరిక:
సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా భయానక వార్తలను, తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గ్రామంలోకి కొత్త వ్యక్తి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. అంతే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు.