కరోనా వేళ కృష్ణా జిల్లాలో ఆవులకు ఎర్రటి మచ్చలు- కళ్లలో రక్తం- స్ధానికుల్లో ఆందోళన..
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్నాయి. ప్రజలు ఇళ్లలో నుంచి రావడానికే జంకుతున్న వేళ ఏపీలోని కృష్ణాజిల్లాలో 70 ఆవులకు ఎర్ర మచ్చలు రావడం, కళ్లలో నుంచి రక్తం కారుతుండటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
కృష్ణాజిల్లాలో ఆవులకు అస్వస్ధత..
కృష్ణాజిల్లా కొండపల్లిలో 70 ఆవులు తాజాగా అస్వస్దతకు గురయ్యాయి. వీటికి కొన్నిరోజులుగా శరీరంపై ఎర్రమచ్చలు రావడంతో పాటు కళ్లలో నుంచి రక్తం కారుతోంది. దీంతో ఏమై ఉంటుందన్న ఆందోళన స్ధానికుల్లో పెరిగింది. చూస్తుండగానే ఎక్కువ సంఖ్యలో ఆవులకు ఇదే సమస్య తలెత్తడంతో అసలే కరోనా భయాలతో ఉన్న ప్రజలు ఇళ్లలో నుంచి బయటికే రావడం మానేశారు. స్ధానికుల ఫిర్యాదు మేరకు అధికారులు రంగంలోకి దిగారు.
అంటువ్యాధిగా నిర్ధారణ...
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తున్న నేపథ్యంలో గోవులను తాకితే తమకు కూడా వైరస్ అంటుకుంటుందనే భయంతో ప్రజలు దగ్గరికి కూడా రావడం లేదు. దీంతో స్దానికల నుంచి ఫిర్యాదు అందుకున్న వెటర్నరీ డాక్టర్లు.. వాటికి పరీక్షలు నిర్వహించారు. చివరికి గోవులకు పొంగుజబ్బు వచ్చినట్లు నిర్ధారించారు. అయితే ఇది కూడా వైరస్ సంబంధమైనదే కావడంతో ఒక గోవు నుంచి ఇతర గోవులకు పాకి ఉంటుందని భావిస్తున్నారు. ఈ గోవులను పోషిస్తున్న వారికి కూడా వ్యాప్తించిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
కరోనా భయాలపై క్లారిటీ..
ప్రజల్లో ఒకరి నుంచి మరొకరికి స్పర్శ ద్వారా సోకుతున్న కరోనా వైరస్ గోవులకు సోకే అవకాశాలు లేవని డాక్టర్లు చెప్పడంతో స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గోవుల్లో పొంగు వైరస్ మాత్రం శరీరం నుంచి కడుపులోకి వెళ్లి ఉంటే ప్రమాదం తప్పదని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. దీంతో స్ధానికంగా ఉన్న పశువుల ఆస్పత్రిలో వారం రోజుల పాటు వీటిని ఉంచి చికిత్స నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
స్దానికంగా రోడ్లపై తిరిగే గోవుల పట్ల యజమానులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.