విజయవాడకు కేసీఆర్: ఏపీ రాజకీయాల్లో ఫిబ్రవరి నెలకు ప్రాముఖ్యత
ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెలకు రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే టీఆర్ఎస్తో వైసీపీ అంటకాగుతోందని ఏపీ టీడీపీ నాయకులు విమర్శిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే నెలలో ఏపీలో అడుగుపెట్టనున్నారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు వెళ్లడం ఇటు రాజకీయవర్గాల్లో అటు ఏపీ ప్రజల్లో చర్చనీయాంశమైంది.
తెలుగు రాష్ట్రాల్లో వేడెక్కిన రాజకీయాలు
ఏపీలో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. ఇక సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన దూతగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైసీపీ అధినేతను కలవడం తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా స్వయంగా సీఎం కేసీఆర్ ఏపీకి వెళ్లనుండటంతో హీట్ కాస్త ముదిరింది.
అమరావతిలో బీజేపీ వ్యతిరేక పార్టీల మెగా ర్యాలీ
ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి అమరావతిలో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కోల్కతాలో మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన మెగా ర్యాలీ సక్సెస్ కావడంతో ఇలాంటి సభలు మరిన్ని పెట్టాలన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు వచ్చే నెల చివరివారంలో ఏపీలో సభను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ తాడేపల్లిలో సొంత ఇళ్లు నిర్మించుకోవడం, అక్కడే పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోవడంతో ఇక పూర్తిగా విజయవాడకే పరిమితం కానున్నారు. ఈ కొత్త ఇంటి గృహప్రవేశం వచ్చే నెల 14న జరగనుంది.
జగన్ గృహప్రవేశ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు..?
జగన్ గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే రోజున కేసీఆర్ జగన్లు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ జగన్తో ప్రాథమిక చర్చలు జరిపారు. ఆ సమావేశం తర్వాతే కేసీఆర్ స్వయంగా వెళ్లి జగన్ను ఏపీలో కలుస్తారనే ప్రకటన చేయడం జరిగింది. ఇన్ని రాజకీయ అంశాలతో ఏపీలో ఫిబ్రవరి నెలకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది.