కేసీఆర్ది స్టేట్ టెర్రరిజం, ఇవాళ ఇది రేపు: ఏకేసిన రావెల
హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రంగా మండిపడుతోంది. అలాగే, తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులకు తమ ప్రభుత్వం రీయింబర్సుమెంట్స్ చెల్లించే అవకాశాలను ఆయన కొట్టి పారేయలేదు. అయితే, ఇది చెడు సంప్రదాయానికి నాంది పలికినట్లవుతుందని అన్నారు. అలా చెల్లిస్తే అది తప్పుడు సంకేతాలకు తావిచ్చినట్లవుతుందని చెబుతోంది. మంగళవారం మంత్రి రావెల కిషోర్ కుమార్ విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేట్ టెర్రరిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. స్థానికత పేరిట మరోసారి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తీవ్రంగా రగిలేలా మరింతగా ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో బోధనా ఫీజుల వ్యవహారంలో తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. 30 వేల మంది విద్యార్థుల ఫీజుల బడ్జెట్ 150 కోట్లేనని, అందులో తాము 60 కోట్లు చెల్లిస్తామని, తెలంగాణ ప్రభుత్వం 90 కోట్లు భరిస్తే సరిపోతుందన్నారు.
దానికే కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఫీజుల సమస్యపై చర్చిద్దామని చంద్రబాబు లేఖ రాసినా, బహిరంగ వేదికపై చర్చకు ఆహ్వానించినా స్పందించకుండా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఏమనుకుంటున్నాడు? ఆయనేమైనా నియంత అనుకుంటున్నాడా? ఇదేమైనా రాచరికమనుకుంటున్నాడా? ప్రజాస్వామ్య వ్యవస్థపై, రాజ్యాంగ విలువలపై ఆయనకు నమ్మకం లేదా? నేను చెప్పిందే వేదం అంటూ హిట్లర్లా, రాజులా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు.
ఆయన చర్యలపై తాము బాధ పడుతున్నామని, రాజకీయాలు, ప్రాంతీయ రాగద్వేషాలకు అతీతంగా పని చేసేందుకు ఆయన ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. కేసీఆర్ చర్యలు స్టేట్ టెర్రరిజంలా కనిపిస్తున్నాయన్నారు. ఇప్పుడు స్థానికత పేరుతో ఫీజులు ఇవ్వనంటున్నారని, రేపటి రోజు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోమంటారని, చివరకు ఆంధ్రా వాళ్లు ఈ రోడ్లపై తిరగొద్దని కూడా చెబుతారని ఆయన చర్యలు టెర్రరిజాన్ని తలపిస్తున్నాయన్నారు. ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.