మగాళ్లలో మృగాళ్లలా ఏనుగుల్లో కూడా ఉంటాయా..? లైంగిక దాడిలో ఆడ ఏనుగు మృతి..! ఎక్కడో కాదు...
సాధారణంగా మగవారు మృగాళ్లలా మారి ఆడవారిపై లైంగిక దాడులు చేస్తున్నారనే వార్తలు చదువుతుంటాం.. టీవీల్లో చూస్తుంటాం. సమాజంలో మహిళలకు భద్రత లేదనేది పలు ఘటనలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఓ వార్త మాత్రం చర్చనీయాంశమైంది. ఓ మగ ఏనుగు మరో ఆడ ఏనుగుపై లైంగిక దాడి చేయడంతో ఆ ఆడ ఏనుగు మృతి చెందింది. ఈ విషయం మేము చెబుతున్నది కాదు... వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టులోనే ఉంది.
ఇక అసలు విషయానికొస్తే చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ మగ ఏనుగు మరో ఆడ ఏనుగుపై లైంగిక దాడి చేయడంతో ఆడ ఏనుగు మృతి చెందింది. తొలుత అనారోగ్యం కారణంతో ఏనుగు మృతి చెంది ఉంటుందని అటవీశాఖ అధికారులు భావించారు. కానీ పోస్టుమార్టం చేశాకా వారికే షాక్ ఇచ్చే అంశం వెలుగు చూసింది. మగ ఏనుగు ఆడ ఏనుగుపై లైంగిక దాడి చేయడంతోనే మృతి చెందిందన్న విషయం తెలుసుకుని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఏనుగు రెండు రోజులుగా పలమనేరు మండలం మండిపేట కోటూరు అటవీ ప్రాంతంలో చనిపోయి పడిఉంది. అడవిలోకి కట్టెల కోసం వెళ్లే కొందరు ఏనుగు మృతి చెందిందన్న విషయం గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే మృతి చెంది ఉంటుందని తొలుత భావించారు.
ఇక ఏనుగు చనిపోయి ఉన్న సమయంలో దాని పక్కనే ఓ పిల్ల ఏనుగు కూడా ఉన్నిందని పశువుల కాపరులు చెప్పారు. అయితే ఇప్పుడు ఆ గున్న ఏనుగు కనిపించడం లేదని వెల్లడించారు. ఇక అధికారులు పోస్టుమార్టం కోసం పశువుల ఆస్పత్రికి తరలించగా మరో ఏనుగు దీనిపై లైంగిక దాడి చేయడంతో మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. ఈ వార్త బయటకు పొక్కడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.