మందేసి...అశ్లీల నృత్యాలు వీక్షిస్తూ...అధికారులు కూడా...అవాక్కైన మహిళా పోలీసులు
కర్నూలు: ఒక వ్యవసాయ ఆధారిత కంపెనీ తమ అమ్మకాల్లో తమ టార్గెట్ రీచ్ అయినందుకు మంచి పార్టీ ఇచ్చింది...అదికూడా అలాంటిలాంటి పార్టీ కాదు...కలర్ ఫుల్ పార్టీ...మందు...విందు...అమ్మాయిల అశ్లీల నృత్యాలు...ఇది లేదు అని లోటు ఫీలవకుండా జల్సారాయుళ్లు కోరుకునేవన్నీ ఆ పార్టీలో సమకూర్చింది...సరే ఇంతకీ ఈ పార్టీకి వచ్చిందెవరంటే...
వ్యవసాయ కంపెనీ కాబట్టి సహజంగానే అమ్మకాలు కొనుగోళ్లు సంబంధించిన సిబ్బంది, డీలర్లు,వ్యాపారులు వీళ్లందరూ రావడం కామన్. అంతేనా...అంతేకాదు... ఇలాంటి కంపెనీలు ఇచ్చే అన్ని పార్టీలకు వచ్చినట్లే వ్యవసాయ శాఖ అధికారులు కూడా వచ్చారు...అంతే కాదు...ఈ సారి అదనంగా మరో పోలీస్ అధికారి కూడా వచ్చాడు...ఆ తరువాతే చాలా తతంగం నడిచింది...ఇంతకీ ఎక్కడా?...ఏమైందంటే?...
స్థలం:కర్నూలు...వేదిక: హర్ష లాడ్జి ...
ఫిబ్రవరి 18 తేదీ సాయంత్రం 4 గంటలకు కర్నూలు షీ టీమ్ ఎస్ఐ విజయలక్ష్మికి ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఫోన్ లో సమాచారం వచ్చింది. ఆమె వెంటనే తన సిబ్బందితో కలిసి మఫ్టీలో ఆ లాడ్జిపై రైడింగ్కు వెళ్లారు...ఆ తరువాత సిబ్బందిని అన్ని వైపుల నుంచి సైలెంట్ గా లోపలకు పంపించి తాను కూడా మరో ద్వారం గుండా లోపలకు వెళ్లారు. ఆ తరువాత అక్కడ జరుగుతున్న తంతు అవాక్కయ్యారు...లోపల నేరుగా వ్యభిచారం అయితే జరగడం లేదులే కానీ అంతకంటే ఎక్కువ వ్యవహారమే నడుస్తోంది. దీంతో ఆమె వెంటనే తన మొబైల్ లో అక్కడ నడుస్తున్న వ్యవహారాన్ని చిత్రీకరించడం మొదలు పెట్టారు.
ఇంతకీ లోపల...ఏం జరుగుతుందంటే...
లోపల ఒక పబ్బును తలపిస్తూ...స్టేజీ మీద పెద్ద సంఖ్యలో అమ్మాయిలు అశ్లీల నృత్యాలు చేస్తూ ఉండగా...మరో వైపు టేబుళ్ల పైన మందు...విందు...వీటికి తోడు ఫుల్లుగా మందేసిన కొందరు జల్సారాయుళ్లు డ్యాన్స్ లు వేస్తున్న అమ్మాయిల చట్టూ చేరి అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని సహకరించమంటూ బలవంతం చేస్తున్నారు...ఇవీ షీ టీమ్ ఎస్ఐ లోపలకు వెళ్లేసరికి కనిపించిన దృశ్యాలు...బైట లోకంతో సంబంధం లేనట్లుగా మరో ప్రపంచంలో తేలియాడుతున్న వారిని తరువాత గుర్తించేందుకు వీలుగా ఎస్ ఐ వారినందరిని తన మొబైల్ లో చిత్రీకరించడం ప్రారంభించారు.
ఆ జల్సారాయుళ్లలో...కొంతమందిని గుర్తించి...షాక్
అలా లోపల వేరే లోకంలో తేలిపోతున్న జల్సారాయుళ్లను వీడియోలో బంధిస్తూ వెళుతున్న ఎస్ఐ...మొబైల్ ఫ్రేమ్ లోకి వచ్చిన ఒక వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డారు. ఆయన్ని చూడటంతోనే అలవాటుగా శాల్యూట్ చేసేశారు. ఆయన ఇంతకుముందు వన్టౌన్ సీఐగా పనిచేసిన సీనియర్ ఆఫీసర్...ఇప్పుడు జిల్లా పోలీసు కార్యాలయంలో కీలక విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. ఆ ఎస్ఐ తనను కూడా చిత్రీకరించడం చూసి ఆ తరువాత ఉలిక్కిపడటం ఆయన వంతయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆయన తమాయించుకొని ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ షీ టీమ్ బృందాలను ప్రశ్నించారు. వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందిందని చెప్పడంతో...వ్యభిచారమా? పాడా? ఏదో పార్టీ...జస్ట్ డ్యాన్స్ జరుగుతుందంతే...ఇది కామనేనంటూ నిర్వాహకులకు సపోర్టు పలుకుతూ ఇంక ఇక్కడినుంచి వెళ్లిపోండంటూ బాసిజం చూపే ప్రయత్నం చేశారు.
ఈ లోపు జల్సారాయుళ్ల పరార్...సిఐ ప్రయత్నం...
ఈ సంభాషణ నడుస్తుండగానే వచ్చింది షీ టీమ్ పోలీసులని తెలిసి జల్సారాయుళ్లలో కొందరు పారిపోయారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు కూడా పారిపోయే ప్రయత్నంలో ఉండగానే వారిలో ముగ్గురిని షీటీమ్ సభ్యులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పార్టీలో ఉన్న జల్సారాయుళ్లంతా పరారైనా ఆ సీఐ మాత్రం షీ టీమ్ సిబ్బంది చుట్టూ తిరుగుతూ విషయం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టేందుకు, వారిపై ఒత్తిడి తెచ్చేందుకు, ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇక తన మాట చెల్లుబాటు కావడం లేదని తెలుసుకుని తాను కూడా అక్కడి నుంచి పరారయ్యాడు.
సిసి కెమేరాలున్నా...సిఐ చరిత్ర..
ఈ పార్టీలో ప్రముఖ వ్యవసాయాధికారులు కూడా ఉన్నారని, లాడ్జిలో సీసీ కెమెరాలు ఉన్నా కూడా తమను ఎవరూ ఏం చెయ్యలేరన్నా ధీమానో లేక పోలీసులను ముందే మేనేజ్ చేశారో తెలియదు కానీ...కర్నూలు నగరం నడిబొడ్డున మెయిన్ రోడ్డు పక్కనే మిట్ట మధ్యాహ్నం నుంచే ఈ పార్టీ జరుపుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో సంబంధిత సీసీ పుటేజీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు రక్షణ కల్పించి బ్రోతలింగ్ అరికట్టాల్సిన అధికారులు, సీఐ సైతం ఈ పార్టీని ఎంజాయ్ చేస్తుండటం గమనార్హం.ఇక ఈ సిఐపై గతంలో కూడా ఆ సీఐపై పలు ఆరోపణలు ఉన్నాయి. వన్టౌన్ పోలీసుస్టేషన్లో పనిచేసే సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్తో తన ఇంట్లోనే రాసలీలలు జరుపుతుంటే భార్య రెడ్హ్యాండెడ్గా పట్టుకుని టూటౌన్ పోలీసులకు అప్పగించిందట. నంద్యాల టూటౌన్లో పనిచేసే సమయంలో ఈయన రాసలీలలపై పత్రికల్లో వరుస కథనాలు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కడ పనిచేసినా భారీ ఎత్తున ఆరోపణలు ఎదుర్కోవడమే ఈయన స్పెషాలిటీ.
ఇంతకీ పార్టీ నిర్వహించింది...క్రిస్టల్క్రాప్
ఇంతకీ ఈ పార్టీ క్రిస్టల్క్రాప్ ప్రొటెక్షన్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులకు, డీలర్లకు ఈ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది లక్ష్యాలను పూర్తిచేసుకున్న వారికి నజరానాగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. షీ టీమ్ తాము అదుపులోకి తీసుకున్న యువతులు, లాడ్జి ఓనర్ ప్రసాద్రెడ్డి, క్రిస్టల్క్రాప్ కంపెనీ బ్రాంచి మేనేజర్ సుబ్బారావు, జోనల్ మార్కెటింగ్ మేనేజర్ సురేష్, లాడ్జి యజమాని మేనల్లుడు రామచంద్రారెడ్డి, లాడ్జి మేనేజర్ షెక్షావలి, సామ్సన్తో పాటు మరో 20 మంది డీలర్లు, వ్యవసాయాధికారులుపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఆ యువతులను హైదరాబాద్ నుంచి రప్పించినట్లు తేలింది. కంపెనీకి చెందిన ప్రముఖులు హైదరాబాద్లో ఉన్న బ్రోతల్ పాండు అనే వ్యక్తి ద్వారా ఆ యువతులను ఇక్కడికి పిలిపించినట్లు సమాచారం. పాండు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ పార్టీ పూర్తిగా వ్యవసాయాధికారులకు సంబంధించింది కాగా ఆ సీఐకి ఈ పార్టీకి సంబంధం ఏమిటి? ఆయన ఈ పార్టీకి ఎందుకు వచ్చారు? అనే కోణాల్లో కూడా పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
పార్టీ ఎందుకంటే...తమను తప్పించాలంటూ...పోలీసుల తీరుపై విమర్శలు...
ఎరువులు, పురుగు మందులు, బయోల తయారీదారులు తమ జోలికి రాకుండా వ్యవసాయాధికారులకు తమ డీలర్ల ద్వారా భారీ మొత్తంలో నగదు, కానుకలు సమర్పించుకోవడంతో పాటు ఈ విధంగా ప్రముఖ హోటళ్లలో మందు, విందు, ఇంకా అమ్మాయిలతో గానాబజానా తదితర కార్యకలాపాలను ఏర్పాటు చేసి కొంతమంది వ్యవసాయాధికారులను మచ్చిక చేసుకుంటున్నారని తెలుస్తోంది...ఈ నేపథ్యంలో తాజా గానాబజానాలో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన సీఐను, వ్యవసాయాధికారులను తప్పించేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. రెడ్హ్యాండెడ్గా దొరికినా కూడా సీసీ పుటేజ్ పరిశీలించిన తర్వాతే మిగతా వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతుండటం గమనార్హం. ఇప్పటికే ఆ సీఐ జిల్లా దాటి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు ముందుముందే పొట్టకూటి కోసం డ్యాన్సర్లుగా మారిన యువతులు, లాడ్జి నిర్వాహకులు, అక్కడున్న సిబ్బందిపై మాత్రం కేసులు నమోదు చేసి జల్సారాయుళ్లుగా మారిన అధికారుల విషయంలో తాత్సారం చేస్తుండటం గమనార్హం.