ఎపి బిజెపిలో పతాక స్థాయికి గ్రూప్ రాజకీయాలు...అధ్యక్షుడిపై అసమ్మతి గళం
అమరావతి: రాష్ట్ర బిజెపిలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయా?...అతి త్వరలోనే అవి బహిర్గతం కానున్నాయా?...ఎపి భాజపా అధ్యక్షుడిపై అదే పార్టీలోని కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా?...అంటే అవుననేట్లుగా కనిపిస్తున్నాయి తాజా పరిణామాలు....ఆదివారం విజయవాడలో జరిగిన బిజెపి నేతల సమావేశం తీరుతెన్నులు చూస్తే అలాగే ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఇంతకీ బిజెపిలో గ్రూప్ లు ఉన్నాయా? ఉంటే ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఆ గ్రూప్ లు ఏర్పడటం వెనుక ఉద్దేశ్యం ఏంటి?...ఈ ప్రశ్నలకు సమాధానాలను రాష్ట్ర రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నవారైనా తేలిగ్గానే జవాబు చెప్పేయొచ్చు...ఎపి బిజెపిలో రెండు గ్రూపులు ఉన్నాయి...అందులో ఒక గ్రూప్ చంద్రబాబునాయుడుకు అనుకూలంగా వ్యవహరించేది కాగా మరో గ్రూప్ ఆయనను తీవ్రంగా వ్యతిరేకించే వర్గం. ఆదివారం విజయవాడ సమావేశంలో చంద్రబాబును వ్యతిరేకించే వర్గం తమ రాష్ట్ర అధ్యక్షుడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చెయ్యడంతో పాటు ఏకంగా ధిక్కారస్వరాన్ని వినిపించేంత వరకూ వెళ్లిందట.
ఆదివారం విజయవాడ సమావేశంలో...బట్టబయలు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎపికి అన్యాయం జరిగిందన్న విమర్శల నేపధ్యంలో మిత్ర పక్షాలైన టిడిపి-బిజెపిల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆదివారం విజయవాడలో బిజెపి నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు, టిడిపి నేతలు బిజెపికి వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కొందరు అధ్యక్షుడి దృష్టికి తెచ్చారట. అయితే ఆయా నేతలు చేసిన ప్రతిపాదనను హరిబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారట. దీంతో ఆ నేతలు ఇక తమ అధ్యక్షుడు అని కూడా చూడకుండా హరిబాబుపై తమ అసంతృప్తినంతా వెళ్లగక్కారట. పరిస్థితి ఎంతవరకూ వెళ్లిందంటే అసలు అధ్యక్షుడిపైనే ధిక్కార స్వరం వినిపించేంత వరకట.
ఏమనంటే?...ఎందుకంటే?...
కేంద్రంలో అధికారంలో ఉన్నా...మోడీకి నిన్నామొన్నటిదాకా ఎంతో ఛరిష్మా ఉన్నా...ఎపిలో బిజెపి పుంజుకోకపోవడానికి కారణం హరిబాబే నంటూ ఒక వర్గం నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలతో రెచ్చిపోయారట. అసలు రాష్ట్రంలో నాలుగేళ్లుగా బిజెపి బలం పెరగకపోవడానికి, పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లాగా ఉండటానికి కొందరు పార్టీలోనే ఉంటూ టిడిపికి మద్దతుగా నిలవటం వల్లేనని ధ్వజమెత్తారట. చివరకు ప్రధాని మోడీని సైతం చంద్రబాబు, పలువురు టిడిపి నేతలు విమర్శిస్తున్నా బిజెపి ధీటుగా సమాధానం చెప్పలేక పోతోందని, అందుకు కారణం మీవల్లేనని ఆ నేతలు హరిబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారట.
వివాదం రాజుకుంది...ఎందుకంటే...
బిజెపిపై, మోడీపై చంద్రబాబు, టిడిపి చేస్తున్నఆరోపణలకు ప్రతిగా ఎపిలో టిడిపి వైఫల్యాలను ఎండగట్టాలని కొందరు నేతలు బిజెపి సమావేశంలో ప్రతిపాదన తెచ్చారట. అదికూడా ఆషామాషీగా కాకుండా ఒక పద్దతి ప్రకారం ఉద్యమం తీరులో జిల్లాల వారీగా...చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కిందో రాష్ట్ర ప్రజలకు వివరించాలని బిజెపి నేతలు హరిబాబు ముందుకు ప్రతిపాదన తెచ్చారట. అయితే ఈ ప్రతిపాదనకు హరిబాబు ఏ మాత్రం అంగీకరించపోవడంతో ఇక అసంతృప్త నేతలు ఆగ్రహం దాచుకోలేకపోయారట.
ధిక్కార స్వరం నేతలు...వారికి మద్దతుగా మరి కొందరు...
దీంతో ఎపి బిజెపి నేతలు లక్ష్మీపతిరాజు, సన్యాసిరాజు ఒక్కసారిగా హరిబాబుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహోదగ్రులయ్యారట. వారికి పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, మంత్రి మాణిక్యాలరావు, ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు కూడా మద్దతుగా నిలిచారు. దీంతో ఇంతమంది ఒక్కసారిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై ధిక్కార స్వరం వినిపించడంతో హరిబాబు మద్దతుదారులు అవాక్కయ్యారట. అసలు ఊహించని ఈ పరిణామంతో ముందు మౌనం వహించినా ఇక లాభం లేదని వారు కూడా హరిబాబుకు మద్దతుగా తమ వాదన వినిపించడంతో...రెండు వర్గాల మధ్య కొంత సేపు వాగ్యుద్దం నడిచిందట. ఆ తరువాత కూడా ఎవరికి వారు మీ సంగతి తరువాత తేలుస్తాం అన్నట్లుగా తగ్గిపోయారే కానీ...ఒక సర్ధుబాటు వంటిదేమీ జరగలేదట.
ఇప్పటిదాకా బహిరంగ రహస్యం...ఇక త్వరలో బహిర్గతమేనా?...
అయితే ఆదివారం విజయవాడలో జరిగిన బిజెపి సమావేశం ఎపి బిజెపిలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అంతర్గత గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకునేలా అజ్యం పోసాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఎపి బిజెపిలో రెండు వర్గాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే...అయితే చంద్రబాబు వ్యతిరేకవర్గం ఎన్ని విమర్శలు చేసినా కొంతకాలం క్రితం వరకు ఎపిలో చంద్రబాబు అనుకూలవర్గానిదే పైచేయిగా ఉండేది. కారణం వారికి కేంద్రంలో కీలక నేతగా ఉన్న వెంకయ్యనాయుడు మద్దతు పూర్తి స్థాయిలో లభించేది. అయితే ఎప్పుడయితే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారో అప్పటి నుంచి ఏపీలో పరిస్థితి క్రమంగా మారుతూ వస్తోంది. చంద్రబాబు వ్యతిరేకవర్గం బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో బిజెపి ఎదగకుండా చేస్తున్నారంటూ చంద్రబాబుపై బిజెపిలోని ఆయన వ్యతిరేకవర్గం విమర్శల దాడి ముమ్మరం చేసిన నేపథ్యంలోనే కేంద్ర బడ్జెట్ అనంతర పరిణామాలు వారి విమర్శలను మరింత తీవ్రతరం చేసేందుకు సహకరించాయి....దీంతో ఇక తాజా మీటింగ్ లో అధ్యక్షుడిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసినంత పనిచేసిన చంద్రబాబు వ్యతిరేక వర్గీయులు ముందు ముందు ఇంకేం చేస్తారో?...వారిని ఆ పార్టీలోని చంద్రబాబు మద్దతుదారులు ఏ విధంగా ఎదుర్కొంటారో?...ఈ పరిణామాల కారణంగా రాష్ట్రంలో ఎలాంటి పర్యవసానాలు చోటుచేసుకుంటాయో అతి కొద్ది కాలంలోనే తేలిపోతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.