వేడుకలకు తప్పక రండి, రేపే వస్తాం: పీవీ సింధుకు చంద్రబాబు ఫోన్
హైదరాబాద్/అమరావతి: రియో ఒలింపిక్స్లో రజతం సాధించి భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన తెలుగుతేజం పీవీ సింధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న కృష్ణా పుష్కర ముగింపు వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. కృష్ణా పుష్కరాల ముగింపు సందర్భంగా నిర్వహించే వేడుకలు, హారతిలో పాల్గొనాలని ఆహ్వానించారు.
ఇందుకు పీవీ సింధు కూడా సానుకూలంగా స్పందించారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని సోమవారం హైదరాబాద్ వెళ్లి సింధును, ఆమె కుటుంబాన్ని ఆహ్వానిస్తారు.
రేపు చంద్రబాబును కలవనున్న సింధు, కుటుంబ సభ్యులు
పీవీ సింధు, కుటుంబ సభ్యులు, కోచ్ గోపీచంద్ మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరుతారు. సీఎం చంద్రబాబును కలుస్తారు. అనంతరం సాయంత్రం కృష్ణా హారతిలో పాల్గొంటారు.
రేపు ఉదయం 8.30గంటలకు సింధు, గోపీచంద్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తారు. విజయవాడలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా సింధు, గోపీచంద్ను సత్కరించనున్నారు.
సింధుకు ఫిక్కీ మహిళా సంస్థ శాశ్వత సభ్యత్వం
రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు తమ సంస్థలో శాశ్వత సభ్యత్వ అవకాశం కల్పిస్తున్నట్లు ఫిక్కీ మహిళా సంస్థ(ఎఫ్ఎల్వో) హైదరాబాద్ విభాగం ఆదివారం వెల్లడించింది.
సింధు తెలుగు ప్రజలకు గర్వకారణమని... ఆమె విజయం స్ఫూర్తిదాయకమని ఫిక్కీ ఎఫ్ఎల్వో హైదరాబాద్ చైర్పర్సన్ పద్మ కొనియాడారు. సింధును తీర్చిదిద్దడంలో కోచ్ గోపీచంద్ పాత్ర ఆమోఘమని ఆమె అభినందించారు.