ప్రత్యేక హోదాని పక్కదారి పట్టించడమేనా...ఈ రెండు పార్టీల లక్ష్యం
అమరావతి:ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అత్యంత ముఖ్యమైన ప్రాణాధారం లాంటి ప్రత్యేక హోదాపై పోరాటం జరుపుతున్నతరుణంలో రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పార్టీలు అధికార పక్షం టిడిపి, ప్రతి పక్షం వైసిపి వ్యవహరిస్తున్న తీరు ఎపి ప్రజల గుండెలపై సమ్మెట పోటులా తగులుతోంది. ఈ రెండు పార్టీలు ఇటీవలికాలంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అసలు వీరికి ఇప్పుడు నిజంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం ఇష్టం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి..కారణం ఏమంటే...
ఎపికి విభజన హామీల సాధన కోసం కేంద్రం కలసి పోరాటం చేస్తూ అంతకంతకూ ఒత్తిడి పెంచాల్సిన ఈ రెండు పార్టీలు కనీసం విడివిడిగానైనా పోరాటం చేయాల్సింది పోయి ఢిల్లీ వేదికగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారంటే దాని వెనుక ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి...జరుగుతున్న పరిణామాలను బట్టి ఎపికి ప్రత్యేక హోదాని పక్క దారి పట్టించడమే ఈ రెండు పార్టీల లక్ష్యమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎలాగంటే?...
చేయాల్సిందేమిటి?...చేస్తుందేమిటి?
ప్రధానికి విజయసాయిరెడ్డి పాదాభివందనం లాంటి నిన్నటి అంశం మొదలుకొని మొన్నటి పిఎంవోలో నేరగాళ్లు...కలసి కాపురాలు చేసుకోవడాలు...ఇలా వివిధ అంశాలకు సంబంధించి వైసిపి విజయసాయిరెడ్డి వర్సెస్ టిడిపి ఎంపీల వ్యవహారం పేపర్లలో చదువుతున్న...టివీల్లో చూస్తున్న తెలుగు ప్రజలకు అసలు రాజకీయాలంటేనే జీవితంలో ఎన్నడూ లేనంత ఏహ్యభావం కలిగిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు వీరు చేయవలసింది ఏమిటి?...చేస్తున్నదేమిటనే సందేహం ఎపికి చెందిన ప్రతి తెలుగువాడిలోనూ రేకెత్తుతోందంటే అందులో అణుమాత్రం కూడా అబద్దం లేదు.
పోరాటం కేంద్రంపై కాకుండా...ఢిల్లీలో..
రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలైన టిడిపి ఇక్కడ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాయంటే అంతర్గత వ్యవహారంగా చెప్పుకోవచ్చు...కానీ ఢిల్లీ వేదికగా ఈ రెండు పార్టీలు ప్రవరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ అంటేనే చులకనగా చూసే పరిస్థితికి తీసుకువస్తున్నారనేది కళ్లెదురుగా కనిపిస్తున్న నిజం. ఈ రెండు పార్టీల తీరు వల్ల రాష్ట్రానికి ప్రధానంగా రెండు నష్టాలు కనిపిస్తున్నాయి. ఒకటి అతి ముఖ్యమైన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన అంతకంతకూ దుర్లభం కావడం...ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీల ముందు చులకన కావడం...మొదటి అంశం కారణంగా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రత్యక్షంగా భంగం వాటిలల్లితే, రెండో అంశం కారణంగా రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలపై రాష్ట్రేతర అన్ని పార్టీలు విశ్వసనీయత కోల్పోవడం జరుగుతుంది.
అసలు లక్ష్యం...అదేనా?
కేంద్రంపై తిరుగుబాటు ప్రకటించిన ఇప్పుడు వైసిపి,టిడిపి ఈ రెండు పార్టీలు ఈ కీలక తరుణంలో కలసి పోరాటం చేయకపోగా...విడివిడిగానైనా లక్ష్యం కోసం చిత్త శుద్దితో ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు...ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని పట్టుకోవడం...దాన్ని పట్టుకొని రాద్దాంతం చేయడం...రెచ్చిపోవడం... అంతిమంగా చూస్తే అలా కాలయాపన చేయడమే అసలు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
టిడిపి ఉద్దేశ్యం అదేనా...అందుకేనా అలా...
ఎపికి ప్రత్యేక హోదాపై అనేక యు టర్న్ లు తీసుకొని చివరగా మళ్ళీ అదే నినాదం తీసుకున్న టిడిపి...ఈ అంశానికి సంబంధించి తమపై ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు అందరికంటే ఉదృతంగా పోరాటం చేయాల్సి వుండగా, వేగంగా ఫలితాన్ని సాధించే దిశలో మరింత ముమ్మరంగా పనిచేయాల్సి వుండగా ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు అందుకు పూర్తి విరుద్దంగా ఉండటం గమనార్హం. వైసిపికి పోటీగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టిడిపి, ఆ పార్టీ ఎంపీలు అందుకు మద్దతు కూడ గట్టాల్సిన అతి విలువైన సమయంలో వైసిపి నేత విజయసాయిరెడ్డిని, అతన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆ పార్టీని దెబ్బకొట్టాలనే ధ్యేయంతో అందుకోసమే సమయం వెచ్చిస్తున్న తీరు ఆ పార్టీకి విభజన హామీల సాధనపై ఉన్న మక్కువెంతో తేటతెల్లం చేస్తోంది.
వైసిపి కి కూడా కావాల్సింది అదేనా...ప్రత్యేక హోదా కాదా?
టిడిపి అనివార్యమైన రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ విధమైన ఎత్తుగడలకు పాల్పడుతుందని అనుకుంటే...మొదటి నుంచి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటున్న వైసిపి ప్రత్యర్థి పార్టీ వ్యూహాలకు ప్రతిగా స్పందిస్తున్న తీరు ఆ పార్టీపై కూడా అనుమానాలకు తావిస్తోంది. ఎలాగంటే...వైసిపి ని లక్ష్యంగా చేసుకొని టిడిపి ఈ విధమైన దాడులకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు...అయితే ఇంతకాలం సంయమనం వహించి ముందుకు వెళ్లిన వైసిపి...ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసే సమయంలో ఎందుకు అతిగా స్పందిస్తోంది...ఎందుకు దాడులకు ప్రతిదాడులకు సమయం వెచ్చిస్తోంది...అంటే ఈ రెండు పార్టీలు ఎలాగూ ప్రత్యేక హోదా తేలేము కాబట్టి ప్రజల దృష్టి మళ్లించేందుకు, కాలయాపన చేసేందుకు...ఇలా ఎన్నికలు వచ్చేంతవరకు సమయం దొర్లించాలని ఈ విధంగా చేస్తున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి...అదే జరిగితే ఈ రెండు పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి అనూహ్య పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.