అసలే కరోనాతో చస్తుంటే: వేట కొడవళ్ళతో దాడి చేసుకున్న అన్నాతమ్ముళ్ళు
ఏపీలో ఓ వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టటానికి మరోవైపు లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. ఇదిలా ఉండగానే ఏపీలో రెండు కుటుంబాలు కత్తులు దూసుకున్నాయి. వ్యవసాయ పైప్లైన్ విషయంలో తలెత్తిన వివాదం వేటకొడవళ్లతో పరస్పర దాడులకు దిగేదాకా వెళ్ళింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు .
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అన్నదమ్ముల మధ్య గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. గుడిపల్లి మండలం గుండ్ల సాగరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ స్థానికంగా వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు . ఈ క్రమంలో తన పెద్దనాన్న కుటుంబంతో వ్యవసాయ పొలంలో వేసిన పైప్లైన్ విషయంలో వారికి ఘర్షణ జరిగింది . మాటమాట పెరిగి ఇరుకుటుంబాలు కొట్టుకునే వరకు వెళ్లారు.
చంద్రశేఖర్ కుటుంబంపై కర్రలు, వేటకొడవళ్లతో దాడి చేశారు. స్వయాన చిన్నాన్న, పెద్ద నాన్న కుమారుల మధ్య వేటకొడవళ్ళతో దాడులు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటన తెలిసిన స్థానికులు ఒక పక్క కరోనా భయంతో ప్రపంచం వణికిపోతుంటే దాడులు చేసుకోటానికి ఇదే టైం కుదిరిందా అని మాట్లాడుకుంటున్నారు.