చేతులెత్తేసిన పవన్ కళ్యాణ్!: 'ముద్రగడ'పై వైసిపి, కాంగ్రెస్ పోటీపోటీ
విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆందోళనకు నిన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి కూడా తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
దీంతో ముద్రగడకు కాంగ్రెస్, వైసిపిల అండ లభించింది. ఈ నెలాఖరున ముద్రగడ ఆధ్వర్యంలో.. కాపులను బీసీల్లో చేర్చాలని పెద్ద సభను నిర్వహించనున్నారు. దీనికి కాపులు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, వైసీపీలు చెబుతున్నాయి. తద్వారా ఇరుపార్టీలు టిడిపిని టార్గెట్ చేసుకున్నాయి.
చంద్రబాబుపై ముద్రగడ 'కాపు' ఫైట్: వెనుక జగన్, దాసరి చెవిలో వేశారు!
కొద్ది రోజుల క్రితం వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దర్శకరత్న దాసరి నారాయణ రావును కలిశారు. తాము ముద్రగడకు మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. జగన్ కాపులను తన వైపుకు తిప్పుకునే ఉద్దేశ్యంలో భాగంగానే దాసరిని కలిశారనే వాదనలు వినిపించాయి. అంతేకాదు ఆయన దాసరిని పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాకర్ష నేత చిరంజీవి ఉన్నారు. జగన్ కూడా వచ్చే ఎన్నికల నాటికి కాపులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. వైసిపి, కాంగ్రెస్ పార్టీలు ముద్రగడకు మద్దతు పలకడం ద్వారా కాపుల మన్నన చూరగొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.
మరోవైపు, ముద్రగడ సభను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కాపు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని రఘువీరా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ నిర్వహించే సభకు వెళ్లవద్దని టిడిపి కాపు ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తూ కాపు జాతికి ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ముద్రగడ 'కాపు' ఫైట్కు జగన్ మద్దతు: రంగంలోకి కాంగ్రెస్, బాబుకు చిక్కు
తద్వారా టిడిపి కాపులకు వ్యతిరేకమనే అభిప్రాయాన్ని కల్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోందని అంటున్నారు. ఇప్పటి వరకు కాపులను బిసిల్లో చేర్చే అంశంపై తుది నిర్ణయానికి రాకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కారణంగానే కాపులు టిడిపి - బిజెపి కూటమికి అండగా నిలిచారని చాలామంది భావిస్తారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ కూటమి వైపే ఉన్నారని చెప్పవచ్చు.
అయితే, కులపరంగా మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకి. కులపరంగా, మతపరంగా చీల్చవద్దని గతంలోనే పవన్ వ్యాఖ్యానించారు. దీంతో, విపక్షాల కాపు ఫైట్ను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారని తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోందంటున్నారు. వివి వినాయక్ను చంద్రబాబు రంగంలోకి దింపినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది.