పవన్ కళ్యాణ్, చిరంజీవి: సర్దుకున్నారు (పిక్చర్స్)
హైదరాబాద్: సీమాంధ్ర ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ప్రచార రథ సారథి చిరంజీవి, ఆయన తమ్ముడూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కత్తులు దూసుకుంటారని అందరూ భావించారు. ఎదురెదురు శిబిరాల్లో నిలబడి సర్దుకుంటూనే ముందుకు సాగారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై పవన్ కళ్యాణ్ దుమ్మెత్తి పోశారు. కాంగ్రెసు హఠావో, దేశ్ బచావో అని నినాదం ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ నినాదానికి చిరంజీవి సున్నితంగానే సమాధానమిచ్చారు. 125 ఏళ్ల కాంగ్రెసు పార్టీని ఎవరూ భూస్థాపితం చేయలేరని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై చిరంజీవిని తప్పు పట్టడానికి పవన్ కళ్యాణ్ నిరాకరించారు. రాష్ట్ర విభజనలో తన అన్నయ్య పాత్ర లేదని, కాంగ్రెసు అధిష్టానం ముఖ్య పాత్ర పోషించిందని ఆయన అన్నారు.
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని తిడితే తాట తీస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, చిరంజీవి మాత్రం తన ప్రచారాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎక్కుపెట్టారు. మొత్తం మీద వ్యూహాత్మకంగా అన్నదమ్ములిద్దరూ సర్గుకుపోయినట్లు కనిపిస్తున్నారు. పైగా, వారిద్దరు కూడా పోటీలో లేరు. దీంతో వారి పాత్ర ప్రస్తుత ఎన్నికల్లో ముగిసినట్లే.
కాంగ్రెసు హఠావో
పవన్ కళ్యాణ్ అనూహ్యంగా జనసేన పార్టీని పెట్టి కాంగ్రెసు హఠావో దేశ్ బచావో అనే నినాదం ఇచ్చారు. ఇది చిరంజీవిని ఇబ్బంది పెడుతుందని భావించారు.
ఎందుకు పెట్టాడో...
పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టాడో, అతని ఉద్దేశం ఏమిటో తనకు ఏ మాత్రం అర్థం కాలేదని కాంగ్రెసు నేత చిరంజీవి అన్నారు.
పరిస్థితి కల్పించింది అధిష్టానం
అన్నయ్యకు వ్యతిరేకంగా నిలబడే పరిస్థితిని కల్పించింది కాంగ్రెసు అధిష్టానమేనని పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పారు.
అన్నయ్య పాత్ర లేదు..
రాష్ట్ర విభజనలో అన్నయ్య చిరంజీవి పాత్ర లేదని, రాష్ట్ర విభజన కాంగ్రెసు అధిష్టానం పని అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
కాంగ్రెసును భూస్థాపితం చేయలేరు
కాంగ్రెసు హఠావో అని పిలుపునిచ్చిన తమ్ముడికి సమాధానం అన్నట్లుగా 125 ఏళ్ల తమ పార్టీని ఎవరూ భూస్థాపితం చేయలేరని ఆయన అన్నారు.
ఇద్దరూ జగన్పైనే...
కాంగ్రెసు అన్నయ్య, జనసేన తమ్ముడు ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపైనే తమ మాటల ఈటెలు విసిరారు.
సహించనన్న పవన్
మోడీని ఎవరైనా ఏమైనా అంటే సహించబోనని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మోడీని విమర్శించిన కెసిఆర్ తాట తీస్తానని హెచ్చరించారు.
మోడీపై చిరంజీవి తక్కువ..
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై చిరంజీవి పెద్దగా విమర్శలు చేసినట్లు కనిపించలేదు. జగన్నే లక్ష్యం చేసుకున్నారు.
కాంగ్రెసు అన్నయ్య, బిజెపి - టిడిపి తమ్ముడు
సీమాంధ్రలో కాంగ్రెసుకు అన్నయ్య ప్రచారం నిర్వహించగా, బిజెపి -టిడిపి కూటమి కోసం తమ్ముడుపవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం సాగించారు.