పరిటాల శ్రీరామ్పై కేసు నమోదు చేయండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
Recommended Video
అనంతపురం:వైకాపా కార్యకర్తపై దాడి ఆరోపణల కేసులో ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని అనంతపురం జిల్లా రామగిరి పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న పేరూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం పెట్టామన్న కోపంతో పరిటాల శ్రీరామ్తోపాటు మరికొందరు తన ఇంటికొచ్చి మారణాయుధాలతో దాడిచేశారని రామగిరికి చెందిన వైసీపీ కార్యకర్త బోయలక్కెనగారి నారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
అంతేకాకుండా తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారని పిటిషన్ లో వివరించిన నారాయణ పోలీసులకు ఈ విషయం తెలిపినా మంత్రి కుమారుడు కావడంతో పోలీసులు తన ఫిర్యాదు పట్టించుకోలేదని పేర్కొన్నాడు. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన హై కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని రామగిరి పోలీసులను ఆదేశించింది.
ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు.. దివంగత తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి కుమారుడైన పరిటాల శ్రీరామ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బోయ సూర్యం సంచలన ఆరోపణలు చేశారు. పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో వచ్చి మారణాయుధాలతో తనను బెదిరించాడని.. అక్కడితో ఆగకుండా తనను తీసుకొని వెళ్ళి కొట్టారని ఆరోపణలు చేశారు.
ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే విషయమై ఫిర్యాదుదారు అనంతపురం జిల్లా ఎస్పీకి తన ఫిర్యాదును రిజిష్టర్ పోస్టులో పంపానని మీడియాకు వెల్లడించాడు. తాను ఫిబ్రవరి నెల 7 వ తేదీన వైసీపీ నేతలతో పేరూరులో పర్యటించానని...ఇది పరిటాల శ్రీరాంకు నచ్చలేదని...దీంతో శ్రీరామ్ తన అనుచరులు మాదాపురం శంకర్, కొత్తపల్లి శివకుమార్ తదితరులతో సూర్యం ఇంటికి వచ్చి బెదిరించి తీసుకెళ్లారని వివరించాడు.
అక్కడ తనను చిత్రహింసలకు గురి చేశారని...వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో కలిసి తిరిగితే చంపేస్తామని బెదిరించారని తెలిపాడు. వారు తనపై దాడి చేయడంతో తన చేయి విరిగిందని...దానికి ఆసుపత్రికి తీసుకెళ్లి కట్టు కట్టించారన్నారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని...తోపుదుదర్తి బద్రర్స్ ప్రధాన అనుచరుడిగా చెప్పారు. చంపుతామని బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయిస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా మిగిలిపోయారని ఆరోపించారు. తన సంతకంతోనే వైసిపి నేతలు తోపుదుర్తి చందు, నాగరాజులపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు అప్పట్లోమీడియాకు తెలిపారు.