జగన్తో సెల్ఫీ వివాదంపై...స్పందించిన నటి అలేఖ్య ఏంజెల్:ప్లీజ్...ఆ ఫోటోను తీసేయండి
Recommended Video
హైదరాబాద్:పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగత వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ అభిమానుల నుంచి జగన్ పై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి మొదలైంది. తమ అభిమాన నాయకుడిపై వ్యాఖ్యలకు జవాబుగా మహిళలతో వైసిపి అధినేత జగన్ దిగిన ఫోటోలను పవన్ అభిమానులు పోస్ట్ చేసి నిలదీస్తున్నారు.
ఈ క్రమంలో వైసిపి అధినేత జగన్ తో మోడల్ అలేఖ్య ఏంజెల్ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై జగన్ తీవ్రవ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక్కసారిగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జగన్తో సెల్ఫీ పై అలేఖ్య ఏంజల్ స్పందించి వివరణ ఇచ్చింది. అంతేకాదు ఆ ఫోటోను సోషల్ మీడియా నుంచి తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
అలేఖ్య ఏంజల్...వివరణ
జగన్ తో తన సెల్ఫీ ఫొటో వైరల్ కావడంతో నటి అలేఖ్య ఏంజల్ స్పందించింది. ఆ ఫొటోను సోషల్ మీడియా నుంచి తొలగించాలనంటూ విజ్ఞప్తి చేసింది. గతేడాది ఫిబ్రవరి 18న ఓ సీడీ లాంచ్ సందర్భంగా లోటస్పాండ్లోని జగన్ నివాసంలో ఆయనతో తీసుకున్నసెల్ఫీ ఇదని, ఈ ఫొటో పట్టుకుని రాద్ధాంతం చేయడం తగదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
పవన్ అభిమానులకు...వినతి
జగన్ను ఇరుకున పెట్టేందుకు తన ఫొటోను వాడుకోవడం తగదని పవన్ అభిమానులకు ఆమె విన్నవించుకుంది. ఇటువంటి అర్థపర్థం లేని రూమర్ల ప్రచారం వల్ల తమ గౌరవం, కీర్తి దెబ్బతింటుందని, తానైతే చాలా హర్ట్ అయ్యానని నటి అలేఖ్య ఏంజల్ తన మనోభావాలను వెల్లడించింది.
జగన్ నాకు...తండ్రి,పెద్దన్నయ్య
జగన్ తనకు తండ్రి లాంటివాడని, పెద్దన్నయ్య లాంటివాడని ఈ సందర్భంగా పవన్ అభిమానులకు అలేఖ్య ఏంజల్ తెలిపింది. జగన్ తో సెల్ఫీ దిగింది సీడీ లాంచింగ్ సందర్భమని, ఆ కార్యక్రమానికి తన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారని ఆమె పేర్కొంది. మిగతా వారితో కలిసి జగన్ను రిక్వెస్ట్ చేసి మరీ సెల్ఫీ తీసుకున్నామని వివరిచింది.
నేను కూడా...పవన్ అభిమానినే...
తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినేనని, ఆయన మానవత్వం గల మనిషని నటి అలేఖ్య ఏంజల్ పేర్కొంది. ఓ వర్థమాన నటినైన తనకు పవన్ ఆదర్శమని, అటువంటి వారి గౌరవాన్ని ఇటువంటి పోస్టులు పెట్టి దెబ్బతీయవద్దని ఆమె పవన్ అభిమానులకు సూచించింది. అమాయకులపై అభాండాలు వేయడం ఆపాలని ఆమె ఈ సందర్భంగా కోరింది. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసిన అలేఖ్య...ఇది చదివాకైనా ఆ పోస్టులు తొలగిస్తారని భావిస్తున్నట్లు చెప్పింది.