ఎట్టకేలకు...కనకదుర్గ ఫ్లై ఓవర్ పిల్లర్స్ డిజైన్ కు ఆమోదం
అమరావతి:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ పిల్లర్ల ఆకృతులకు ఎట్టకేలకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ముంబయికి చెందిన ఓ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని రూపొందించింది.
ఫ్లై ఓవర్ నిర్మాణం వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చేఏడాది సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మాణ సంస్థను ఆదేశించారు. అయితే జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాటికి ఫ్లై ఓవర్ ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ సోమా కనస్ట్రక్షన్ ఎండీ హామీ ఇచ్చారని తెలిసింది.
గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏడాది జనవరికి ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులోకి తేవాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తికాగా 62 శాతం బిల్లులు చెల్లించారు. బిల్లుల చెల్లింపుల్లో కేంద్రం నుంచి కొంత సమస్య ఉందని అధికార వర్గాలు సిఎంకు తెలిపినట్లు సమాచారం. అయితే ఈనెల 11న కేంద్ర మంత్రి గడ్కరీ రాజమండ్రికి రానున్నందున ఆ సందర్భంగా ఈ విషయం ఆయన దృష్టికి తీసుకెళతానని సీఎం అధికారులకు, సోమా కంపెనీ ఎండీకి హామీ ఇచ్చారు.
Recommended Video
నాలుగు వరసల రహదారి, ఆరు వరసల కనకదుర్గ పైవంతెన కలిపి రూ.448.60 కోట్లకు సోమా దక్కించుకుంది. ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ.334కోట్లు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.114.60కోట్లు కేటాయించాల్సి ఉంది. ఇది జాతీయ రహదారి కావడంతో కేంద్రం దీన్నిచేపట్టింది. కనకదుర్గ ఫ్లై ఓవర్ మలుపు తిరిగే ప్రాంతంలో డయాగ్నల్గా నిర్మాణం చేయాల్సి ఉంది. అక్కడ సరిపడే స్థలం లేకపోవడంతో పిల్లర్స్ ఒకవైపే నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి ఆకృతులను కేంద్రం మొదట తిరస్కరించింది. ఎట్టకేలకు ముంబయికి చెందిన సంస్థ రూపొందించి అంతర్జాతీయ సంస్థతో ధ్రువీకరణ పొందడంతో సీడీఓ ఆమోదం తెలిపింది.
నగరపాలక సంస్థ పంపుహౌస్ దగ్గర రెండు పిల్లర్లు, నదిలో రెండు పిల్లర్లు, దర్గా ప్రాంతంలో రెండు పిల్లర్లను ఈ విధంగా నిర్మాణం చేయనున్నారు. సాధారణంగా పిల్లర్ మీద రెండు వైపులా పియర్స్ ఏర్పాటు చేసి వాటిపై స్పాన్లు ఏర్పాటు చేస్తారు. సాదారణంగా 16 మీటర్లకు రెండు పియర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత డిజైన్ల ప్రకారం 16 మీటర్లకు ఒకవైపు ఒక పియర్ ఏర్పాటు చేస్తారు. రెండో వైపు స్థలం లేకపోవడం వల్ల ఈ విధంగా చేయాల్సి వచ్చిందని పర్యవేక్షణ ఇంజనీరు తెలిపారు. దీంతో పైవంతెన కింది భాగంలో రహదారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఇదిలావుండగా ఫ్లై ఓవర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థపై తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. తరచూ దీనిపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. పైవంతెన నిర్మాణం జాప్యం వల్ల నగరంపై ట్రాఫిక్ సమస్య భారం పెరిగింది. అదనపు పనులకు సంబంధించిన నిధుల మంజూరుకు కేంద్రం నిరాకరించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధమైంది. ముందుగా వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించింది. తర్వాత కేంద్రం వాటా కోసం పోరాటం చేయాలని నిర్ణయించింది.