వైఎస్ జగన్ను విమర్శించడానికి టీడీపీకి ఇన్నాళ్లకు దొరికిన అంశం అదొక్కటే!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం పనితీరుపై వేలెత్తి చూపడానికి, విమర్శలు గుప్పించడానికి, ఆరోపణలు చేయడానికి తెలుగుదేశం పార్టీకి గానీ, ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గానీ ఇన్నాళ్లూ ఏ మాత్రం అవకాశమే దొరకలేదు. తమకు ఎదురైన ఘోర పరాభవం నుంచి తేరుకోవడానికే చాన్నాళ్లు పట్టిందా పార్టీకి. దీనితోపాటు- వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమణ స్వీకార మహోత్సవ ఖర్చుతో మొదలు పెట్టుకుని మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం వరకు గానీ, ఉప ముఖ్యమంత్రుల ఎంపిక, మంత్రివర్గ కూర్పులో విమర్శలకు ఆస్కారమే లేని విధంగా నిర్ణయాలు తీసుకున్నారు వైఎస్ జగన్.
టీడీపీ నేతల్లో నిరాశ
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా అయిదుమంది ఉప ముఖ్యమంత్రులను ప్రకటించారు. తన సామాజిక వర్గానికి చెందిన రెడ్లను పరిమితం చేసి, బడుగు, బలహీన, దళిత, గిరిజన వర్గాల నుంచి ఎన్నికైన శాసన సభ్యులకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించారు. నిజానికి- వైఎస్ జగన్ తీసుకున్న ఆయా చర్యలన్నీ విమర్శించడానికి, వేలెత్తి చూపడానికి ఏ మాత్రం అవకాశం లేనివే. తెలుగుదేశం పార్టీ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చింది ఇన్నాళ్లు. అభివృద్ధి ఆగిపోయిందని, రాజధాని నిర్మాణాలను స్తంభించిపోయాయని అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విమర్శల్లో కూడా ఏ మాత్రం పస లేదని సొంత పార్టీ నేతలే పెదవి విరిచిన సందర్భాలు ఉన్నాయి.
పార్టీ శ్రేణులు డీలా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశలకు గురి చేస్తోందనడంలో సందేహాలు అక్కర్లేదు. వంక పెట్టడానికి వీల్లేని విధంగా, వామపక్ష నేతలు సైతం ప్రశంసించేలా వైఎస్ జగన్ విప్లవాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలను అప్పటికప్పుడే అమలు చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్ల వేతనాల పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు..ఇలాంటివన్నీ ప్రత్యర్థులు సైతం ప్రశంసలు కురిపించేవేనని చెబుతున్నారు.
దొరికిన తాజా అస్త్రం అదొక్కటే..
ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అనుకోకుండా చేతికి చిక్కింది వివాదం. అదే- తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు. రాష్ట్రంలో అధికార మార్పు చోటు చేసుకున్నప్పటి నుంచి తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చోటు చేసుకుంటున్నాయని, రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయని, తమ పార్టీ కార్యకర్తలకు రక్షణ కరవైందనే తాజా నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది తెలుగుదేశం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులను సూచించారు. దాడులు ఆగేంత వరకూ పోరాడాలని సూచించారు. ఈ దిశగా పార్టీ అగ్ర నాయకత్వం నుంచి అన్ని రకాల సహాయ, సహకారాలు ఉంటాయని అన్నారు. దీనిపై ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది.
దానితోనే అసెంబ్లీకి..
కార్యకర్తలపై దాడులు అనే ఏకైక విమర్శనాత్మక అంశంతో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలకు సమాయాత్తమౌతోంది. అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉండవల్లి ప్రజావేదికలో నిర్వహించిన పార్టీ సమావేశాల్లో ఓ తీర్మానాన్ని చేసింది. ప్రతి ఒక్కరూ ఇదే అంశాన్ని ప్రధానంగా వినిపించాలని, నిర్మాణాత్మకంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దాడులు చేయాలని చంద్రబాబు వారికి దిశా నిర్దేశం చేశారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల అంచనాలను సమీక్షిస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటనను కూడా చంద్రబాబు తప్పు పడుతున్నారు. దీనివల్ల ఆయా ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇందులో ఏ మాత్రం పస లేదని అభిప్రాయం వ్యక్తమౌతోంది.
బెంగాల్ తరహా హింసగా కలరింగ్..!
తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చోటు చేసుకుంటున్నాయనే విషయాన్ని చంద్రబాబు పశ్చిమ బెంగాల్ తరహా హింసాత్మక వాతావరణంగా కలరించే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ తరువాత హింసాత్మక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అదే తరహా వాతవారణం రాష్ట్రంలో కూడా నెలకొందని సూచించేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
పసుపు చొక్కాలతో టీడీపీ ఎమ్మెల్యేలు
శాసనసభ సమావేశాల తొలిరోజు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తమ పార్టీ గుర్తు పసుపురంగుతో కూడుకున్న చొక్కాలను ధరించి హాజరు కానున్నారు. ఈ మేరకు చంద్రబాబు వారికి కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. 23మంది ఎమ్మెల్యేలు కలిసికట్టుగా, పట్టుదలగా పనిచేయాలని, రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్దేశించారు. దాడుల విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, 15వ తేదీన నిర్వహించే టీడీపీ వర్క్ షాప్ లో దీనికి సంబంధించి కార్యాచరణ సిద్దం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.