అప్పు చేశామని గర్వంగా చెబుతున్నాం : కాగ్ నివేదికపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయింది అన్న కాగ్ నివేదికపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో పది నెలల లెక్కలను కాగ్ తన నివేదిక ద్వారా వెల్లడించింది. అంచనాల కన్నా 153 శాతం అధికంగా ఏపీ అప్పులు ఉన్నాయని కాగ్ తేల్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంచనాలకు మించి అప్పులు చేశారని, సగటున ప్రభుత్వం ఖర్చు పెట్టిన వంద రూపాయలలో 45 రూపాయలు అప్పు అని కాగ్ నివేదిక వెల్లడించడంపై స్పందించిన మంత్రి కరోనా కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు.
అంచనాలకు మించి అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ .. దేశంలో అప్పుల్లో ఏపీ ఏ స్థానంలో ఉందో చెప్పిన కాగ్ నివేదిక
ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చలేం .. కరోనా కష్టాల్లో అప్పు తప్పలేదు
కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం ఆర్థిక పరిస్థితి ఇదే విధంగా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. డబ్బున్న రాష్ట్రాల సంగతి పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి లోటు బడ్జెట్ రాష్ట్రం గా ఉందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలతో ఏపీని ఏ విధంగానూ పోల్చలేమని పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో చేసిన ఖర్చు ఏ విధంగానూ కనిపించడం లేదని, అన్ని అసంపూర్తిగానే జరిగాయని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
గత ఏడాది రాష్ట్రంలో కరోనా ప్రభావంతో ఎక్కడికక్కడ వ్యాపార సంస్థలు ఆగిపోయాయని, కరోనా వల్ల నెలకొన్న పరిస్థితుల్లో ఇబ్బంది ఉంది కాబట్టి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ను కేంద్రం 5 శాతానికి పెంచిందని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
ప్రజలను కష్టకాలంలో ఆదుకోవటం కోసమే అప్పు .. గర్వంగా చెప్తున్నాం
ఆదాయం లేకున్నప్పటికీ ప్రజల కోసం ఖర్చు చేసి, ప్రజలను కష్టకాలంలో ఆదుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపిన బుగ్గన, ఇబ్బందులు ఉన్నప్పుడు డబ్బులు పంపిణీ చేస్తే, అవే డబ్బులు ఎకానమీలోకి వస్తాయన్నారు. అందుకే అప్పు చేశానని గర్వంగా చెబుతున్నామని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.
2020 వ సంవత్సరంలో రెవిన్యూ రాబడి పెరిగినప్పటికీ, కరోనా కారణంగా రెవిన్యూ ఖర్చులు కూడా పెరిగాయని, రాబడి పెరగడానికి ప్రభుత్వం డబ్బు పంపింగ్ చేయడమే కారణమని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
ఏపీ అప్పులపై క్లారిటీ ఇచ్చిన బుగ్గన రాజేంద్ర నాథ్
పన్నేతర ఆదాయం కూడా కరోనా సమయంలో ఎక్కువగా వచ్చిందని పేర్కొన్న బుగ్గన గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా కేంద్రం నుంచి తెచ్చుకోగలిగామని పేర్కొన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో గత పది నెలల కాలంలో అంచనాలకు మించి చేసిన అప్పులపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు . అవసరం అయినప్పుడు అప్పులు చెయ్యక తప్పదని , ఇప్పుడు అంతటా పరిస్థితి అలాగే ఉందని స్పష్టం చేశారు .