ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం: ఆన్ లైన్ దరఖాస్తులు: వలంటీర్లకే బాధ్యత
అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటేటా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి అవసరమైన కసరత్తు ఆరంభమైంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన లబ్దిదారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ఆరంభం కానుంది. ప్రభుత్వం మంజూరు చేసే 10 వేల రూపాయల మొత్తాన్ని లబ్దిదారులకు చేతికి అందజేయారు. దీనికోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను లబ్దిదారులు తెరవాల్సి ఉంటుంది.
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు..
బ్యాంకు ఖాతాను తెరవడానికి అవసరమైన సహాయ, సహకారాలను గ్రామ వలంటీర్ల నుంచి తీసుకోవచ్చని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సొంతంగా ఆటో, ట్యాక్సీ, క్యాబ్ వాహనం గల డ్రైవర్లకు ఆర్థిక భరోసాను ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేతగా తాను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీకి అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన వందరోజుల్లోనే నాటి హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చింది. మంగళవారం నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియ ఆరంభం కానుంది.
లైసెన్స్ తో ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి..
సొంతంగా ఆటో, ట్యాక్సీ, క్యాబ్ వాహనాలు ఉండి, వాటిని తామే నడుపుకొంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న డ్రైవర్లకు ఏటేటా 10 వేల రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. డ్రైవర్లకు వేలిడిటీ ఉన్న లైసెన్స్ ఉండి తీరాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వాహన పన్ను చెల్లింపులు అన్నీ పక్కాగా ఉంటేనే అర్హులుగా పరిగణిస్తారు. ఒక కుటుంబంలో ఎన్ని ఆటోలు గానీ ట్యాక్సీలు గానీ ఉన్నప్పటికీ.. ఒక వాహనానికి మాత్రమే ఆర్థిక ప్రోత్సాహం అందుతుంది. ప్రతి డ్రైవర్ కూడా ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డును పొంది ఉండాలంటూ ప్రభుత్వం నిబంధనలు విధించింది. గులాబీ రంగు కార్డు ఉన్న డ్రైవర్లకు ఈ ఆర్థిక సహాయం అందదు. ప్రతి డ్రైవర్ కూడా తన లైసెన్స్ ను ఆధార్ కార్డుతో అనుసంధానించడం తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి ఉప రవాణాశాఖ అధికారి, ప్రాంతీయ రవాణాశాఖ అధికారి, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
10వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ఆరంభం..
ఆయా డ్రైవర్ల లైసెన్స్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు రవాణా శాఖకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ డేటాబేస్ తో పోల్చి చూస్తారు. సరైనదిగా తేలినప్పుడే డ్రైవర్లను అర్హులుగా గుర్తిస్తారు. 10 వేల రూపాయల నగదును ప్రభుత్వం నేరుగా డ్రైవర్ల చేతికి అందించదు. దీనికి అవసరమైన బ్యాంకు ఖాతాను డ్రైవర్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలను తెరవడంలో అవసరమైతే గ్రామ వలంటీర్ల సహాయాన్ని తీసుకోవచ్చని ఈ ఉత్తర్వుల్లో సూచించారు. కాగా.. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తును భర్తీ చేయడంలో డ్రైవర్లు ఎదుర్కొనే ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఆయా కౌంటర్లలో పనిచేసే సిబ్బంది ఆన్ లైన్ దరఖాస్తులను భర్తీ చేయడంలో డ్రైవర్లకు సహకరిస్తారని అధికారులు తెలిపారు.