జగన్ సమర్ధతకు పరీక్ష..విస్తుపోయే వాస్తవాలు : మోదీ సహకరించకుంటే అంతే...అందుకే ఢిల్లీకి.
ఏపీలో భారీ విజయం సాధించిన జగన్కు అసలు పరీక్ష మొదలైంది. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయటానికి నిర్ణయించారు. తొలి సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే...సమర్థత నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఆయనకు ఖాళీ ఖజానా..వేల కోట్ల అప్పులు..చెల్లించాల్సిన బిల్లులు..పధకాల అమలు.. ఎలా..ఈ సమయంలో ప్రధాని మోదీ సహకరించుకుంటే అసలు కష్టాలు మొదలవుతాయి. మరి..రాజకీయ పరీక్షలో పాసయిన జగన్...పాలనా పరీక్షలో నెట్టుకురాగలరా..
20వేల కోట్ల బిల్లుల పెండింగ్..రెవిన్యూ లోటు
జగన్ ఎన్నికల్లో గెలవగానే అభినందనలు తెలపటానికి వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో పరిస్థితిని ఏకరువు పెట్టారు. ఈ నెలాఖరులోగా జీతాలు..పెన్షన్ల కోసం 4500 కోట్లు కావాలని వివరించారు. దీంతో..జగన్ వెంటనే ఆర్దిక పరిస్థితి పైన పూర్తి నివేదిక ఇవ్వాలని..ఆదాయం..ఖర్చులు.. పధకాల నిర్వహణ.. జీతాలు చెల్లింపు..కేంద్ర నిధుల పైన వివరాలు కోరారు. అధికారులు పూర్తి వివరాలను సమర్పించిన సమయంలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. కేవలం చెల్లించాల్సిన బిల్లులే 20 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఈనెలాకరు నాటికి మొత్తం 11 వేల కోట్లు అవసరం. పోలవరం బిల్లులు 6500 కోట్లు కేంద్రం నుండి రావాల్సి ఉంది. వచ్చే నాలుగేళ్లలో నాలుగున్నార లక్షల కోట్ల మేర అప్పులు పెరగుతాయని..వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
జగన్ హామీల అమలు విలువ కలిపితే..
ఇప్పటికే రెవిన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో జగన్ నవరత్నాలను అమలు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న పధకాల్లో జగన్ కొత్తగా ఇచ్చిన హామీలను చేరిస్తే..సంక్షేమ పధకాల అమలు కోసమే ఏటా 57 వేల కోట్లు కావాల్సి ఉంటుందని అధికారులు నివేదిక సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న పన్నుల వాటా..నిధుల్లో భాగస్వామ్యం ద్వారా రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఇప్పట్లో కోలుకోలేదని వాపోయారు. దీంతో..కేంద్రం నుండి ఎటువంటి సాయం పొందే ఛాన్స్ ఉందీ..పెండింగ్ నిధులు ఎంత మొత్తం రావాలనే వివరాలతో నేరుగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఏపీ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు దానిని సాధించాల్సిన బాధ్యత జగన్ పైన ఉంది.
మోదీతో జగన్ కీలక భేటీ..
రెండో సారిగా ప్రధాని మోదీ..ఏపీ సీఎంగా జగన్ ఈనెల 30 ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ సమయంలో జగన్ ఆదివారం మోదీతో భేటీ కానున్నారు. ఈ సమయంలో అయిదేళ్ల కాలంలో ఏపీలో ఏ రకంగా ఆర్దిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందీ వివరించటంతో పాటుగా..ఏపీలోని ఆర్దిక కష్టాలను వివరించనున్నారు. కేంద్రం అండగా నిలవాలని అభ్యర్దించనున్నారు. ఇందు కోసం తనతో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో విభజన హామీల అమలు..పోలవరం నిర్మాణం.. రాజధాని వంటి అంశాలతో పాటుగా కీలకమైన ఏపీకి ప్రత్యేక హోదా పైనా చర్చించనున్నారు. ఏపీకి అండగా నిలుస్తామని పలు సందర్భాల్లో చెప్పిన మోదీ..ఇప్పుడు జగన్ కు ఏ రకంగా సహకరిస్తారేది ఢిల్లీ భేటీలో వెల్లడయ్యే అవకాశం ఉంది.