ఖాళీ ఖజానా..పైగా అప్పులు: రూ. 2.58 లక్షల కోట్ల రుణాలు: కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవా?
అమరావతి: కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖాళీ ఖజానా స్వాగతం పలకబోతోంది. అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దుర్వినియోగం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు ఉన్నాయి. వచ్చే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదంటూ అప్పుడే ఎత్తిపొడుపులు కూడా మొదలయ్యాయి. ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎలాంటి చర్యలు చేపడతారనే విషయం చర్చనీయాంశమైంది. లోటును భర్తీ చేసుకోవడానికి వైఎస్ జగన్ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం జూన్ నెల నాటికి ఉద్యోగుల వేతనాలను కూడా ఇచ్చుకోలేదని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఓ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టాయి. చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న నిధుల దుబారాపై ఏనాడూ పెదవి విప్పని జయప్రకాశ్ నారాయణ.. ఆయన గద్దె దిగగానే కొత్త ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారంటూ విమర్శలు వచ్చినప్పటికీ.. వాస్తవ పరిస్థితి అదే.
షాకింగ్ .. తెలంగాణా సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కిన ఎంపీ విజయసాయి రెడ్డి
అనుభవజ్ఞుడని పట్టం కడితే..
రాష్ట్ర విభజన సమయంలో 16 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో 13 జిల్లాలతో ఏపీ ఏర్పాటైంది. ఆర్థిక లోటు మాటెలా ఉన్నా, 97 వేల కోట్ల రూపాయల రుణలు కూడా ఏపీ వాటా కిందికి వచ్చాయి. ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన పరిపాలన అనుభవంతో ఒడ్డున పడేస్తారని, రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారని అందరూ భావించారు. విభజన తరువాత ఏర్పాటైన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేశారు. చంద్రబాబు హయాంలో నిధులను అడ్డూ అదుపు లేకుండా దుర్వినియోగం చేశారనే విమర్శలు చెలరేగాయి. అప్పట్లో వాటిని ఎవరూ పెద్దగా ప్రచారంలోకి తీసుకుని రాలేదు.
ప్రతినెలా 20 వేల కోట్ల రూపాయల వడ్డీ..
విభజన నాటికి 97 వేల కోట్ల రూపాయల మేర ఉన్న రుణాల భారం ఈ అయిదేళ్ల కాలంలో 2 లక్షల 58 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. దీనికోసం ప్రతి నెలా దాదాపు 20 వేల కోట్ల రూపాయలను వడ్డీగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి సంవత్సరం 40 వేల కోట్ల రూపాయల రుణాన్ని పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రపంచబ్యాంకు సహా కొన్ని జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలను తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో తీసుకున్న రుణ మొత్తాలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టారనే ఆపవాదును ఆయన మూటగట్టుకున్నారు. రాజధాని నిర్మాణం, డిజైన్లు, ప్లాన్ల పేరుతో సింగపూర్, జపాన్, చైనా వంటి దేశాలకు ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడం, తన వెంట పెద్ద సంఖ్యలో మంత్రులు, అధికారుల బృందాన్ని తీసుకెళ్లడం, వారి ఖర్చు ఇలా తడిసి మోపెడైందని చెబుతున్నారు.
వాటిని అధిగమించడం ఎలా?
ఇంత భారీ ఆర్థిక లోటును అధిగమించడం ఒక ఎత్తయితే, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం ఇంకో ఎత్తు. భారీ లోటును పూడ్చుకోవడానికి వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయాలను తీసుకోబోతున్నారనే విషయం ఆసక్తి రేపుతోంది. కాస్త భయాందోళనలకూ గురి చేస్తోంది. కఠిన నిర్ణయాలేమైనా తీసుకుంటారా? అనే చర్చకు తావిస్తోంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు పన్నులు. వాటిని పెంచుతారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి సహకారాన్ని తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారిన అంశం. కేంద్రం తలచకుంటే- ఆర్థిక లోటు నుంచి గట్టెక్కడం కష్టతరమేమీ కాదు. తమకు సంబంధం లేని రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం పెద్ద మనసుతో ఆదుకుంటుందా? అనే ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానాలు దొరక్కపోవచ్చు.
ప్రత్యేక హోదా నిజంగా సంజీవినేనా?
జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేరిన రాష్ట్ర ఖజానాను ఆదుకోవడంలో ప్రత్యేక హోదా నిజంగానే ఓ సంజీవినిలా పని చేస్తుందంటున్నారు విశ్లేషకులు. హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక ప్రాధాన్యతే దీనికి కారణం. హోదా ఉన్న రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్లో 90 శాతం మేర రాయితీలు ఉంటాయి. పన్నుల్లో మినహాయింపులు ఉంటాయి. కేంద్రం నుంచి అదనపు ఆర్థిక సాయం ఉంటుంది. దాదాపుగా అన్ని నిధులను గ్రాంట్ల రూపంలో విడుదల చేస్తారు. వాటివల్ల రాష్ట్రం ఈ గండం నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది.