ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి, తగ్గిన ఆదాయం, పెరిగిన రెవెన్యూ వ్యయం, 8 నెలల్లో 35 వేల కోట్ల అప్పు
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది నెలల జగన్ పాలనలో ప్రగతి పడకేసిందని యనమల విమర్శించారు. సంపద సృష్టించడం ఎలాగో సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియదని, అందుకే అభివృద్ధి పడకేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని యనమల రామకృష్ణుడు తెలిపారు. దీంతో రెవెన్యూ వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు. ఇక ఉద్యోగులు, మిగతా పెన్షన్లకు కూడా నిధులు లేవని గుర్తుచేశారు. ఆర్థికమాంద్యంతో పరిస్థితి ఇలా ఉంటే.. రాజధాని మార్పు పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ చేతగానితనంతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అభివృద్ధి చేయడం, సంపద సృష్టించడం తెలిస్తే ఇబ్బందులు తప్పేవని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లోనే రూ.35 వేల కోట్ల అప్పులు చేసిందని గుర్తుచేశారు. మరో నాలుగున్నరేళ్లలో అప్పులు ఏ విధంగా చేసి, వాటిని ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడం లేదని, అందుకే బాలారిష్టాలు తప్పడం లేదని చెప్పారు.