జగన్ వచ్చాకే ఏపీలో ఆర్ధిక స్వాతంత్ర్యం : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .దేశానికి స్వాతంత్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా , ఏపీకి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది మాత్రం కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాక మాత్రమే అని ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అడుగడుగునా అడ్డు పడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
చిత్తూరులో మీడియా సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇప్పటికి మూడు తేదీలు పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. నిరుపేదలెవరు భూకబ్జాలకు పాల్పడరని, ఈ విషయంలో కోర్టులు నిరుపేదలను దృష్టిలో తీసుకొని న్యాయం చెప్పాలని హైకోర్టు ,సుప్రీంకోర్టు లకు ఆయన అప్పీల్ చేశారు.
భూ కబ్జాలకు పాల్పడేవారు వేరే ఉన్నారని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చంద్రబాబు కుంటిసాకులతో పేదలకు ఇళ్ల పంపిణీ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో కోర్టులు త్వరగా మంచి తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు.
కేవలం 27 గ్రామాల కోసమే చంద్రబాబు మూడు రాజధానులు అంశాన్ని అడ్డుకుంటున్నారు అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.మూడు రాజధానులు ఏర్పాటు కాకుండా కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని విమర్శించారు.
అమరావతి ప్రాంతంలోని అన్నపూర్ణగా ఉండే సాగు భూములను చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధాని భూములుగా మార్చారని విమర్శించారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ పాలనలో సంతోషంగా ఉన్నారని, వారికి ఇప్పుడు ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ప్రగతి పథాన నడుస్తుందని ఆయన పేర్కొన్నారు.