ఇక, ఏపీకి వీఐపీ హోదా: కొత్త ట్విస్ట్లు, పవన్ కళ్యాణ్ దెబ్బకి దిగొచ్చిన 'బీజేపీ'!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ కొత్త రాగాలు అందుకుంటోంది. ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికీ దానికి సమానంగా నిధులు ఇస్తామని, ఏపీని ఆదుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
హోదాతో కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దాంతో ప్రతి గ్రామం వెంటనే అభివృద్ధి చెందదని, కేంద్రం ఇచ్చే నిధులు వద్దనవద్దని, ఏపీ అభివద్ధిని కాంక్షించే వారు కేంద్రం ఇస్తున్న నోటికాడి అన్నంను వద్దని చెప్పవద్దని కేంద్రమంత్రి వెంకయ్య ఆదివారం అన్నారు.
కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఏపీకి తాము వీఐపీ హోదా ఇస్తున్నామని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ.2,500 కోట్లు ఇచ్చామని, మరో రూ.వెయ్యి సమయానుకూలంగా ఇస్తామన్నారు.
పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: సుజన అలా, వెంకయ్య ఇలా, బాబుకు తెలిసే
ఏ రాష్ట్రంలో లేని విధంగా 11 జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి కేటాయించామని, వీటిలో తొమ్మిదింటిని ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. త్వరలో నెల్లూరు జిల్లాలో సముద్ర తీర ప్రాంత అధ్యయనానికి ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతాయన్నారు.
జాతీయచ విద్యా సంస్థల పనులన్న పూర్తి చేసేందుకు రూ .10వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఐదేళ్లలో 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఏపీకి రూ.2.06 లక్షల కోట్లు వస్తాయని చెప్పారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీని నిలదీయడంపై ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. కేంద్రం సాయాన్ని పాచిపోయిన లడ్డూలతో పోల్చడం సరికాదన్నారు. తమవి పాచిపోయిన లడ్డూలు కావని పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలు అన్నారు.
పవన్-మోడీ మధ్య చిచ్చు: ట్విస్ట్.. జనసేన 'అతి', దెబ్బకి వెంకయ్య రివర్స్!
ఇప్పటికే ఏపీకి హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పిన బీజేపీ నేతలు.. ఏపీని ప్రత్యేకంగా చూస్తున్నామని, ప్రధాని మోడీ కూడా ఏపీ పైన ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని, ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేరుస్తామని, హోదాను మించి నిధులు ఇస్తామని చెబుతున్నారు. ఇప్పుడు జవదేకర్ ఏపీకి వీఐపీ హోదా ఇస్తున్నామని చెప్పడం గమనార్హం. బీజేపీ నేతల వ్యాఖ్యలతో హోదా కోరుకుంటున్న వారు చల్లబడతారా చూడాలి.
పవన్ కళ్యాణ్ దెబ్బకి అంతా దిగారు!
ఇన్నాళ్లు ప్రత్యేక హోదా పైన విపక్షాలు వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా నిలదీస్తే బీజేపీ, టీడీపీ నేతలు ఎదురు దాడి చేశారు. పవన్ కళ్యాణ్ విషయంలోను అదే జరిగింది. అయితే, వైసిపి, కాంగ్రెస్ పార్టీల కంటే పవన్ కళ్యాణ్ పైన బీజేపీ నేతల దూకుడు మరింత ఎక్కువ కనిపించింది.
తిరుపతిలో కొద్దిగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్, కాకినాడ సభలో మాత్రం బీజేపీ పైన నిప్పులు కురిపించారు. దీంతో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ నేతలు హరిబాబు, విష్ణువర్ధన్ రెడ్డి, విష్ణు కుమార్ రాజులతో పాటు ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తదితరులు అందరూ పవన్కు కౌంటర్ ఇస్తున్నారు.