పాలనకు శరాఘాతంలా పరిణమించిన ఆర్థిక పరిస్థితి..! సీయం జగన్ ముందు పలు సవాళ్లు..!!
అమరావతి/హైదరాబాద్ : చంద్రబాబు వ్యూహాలను చిత్తు చేసి .. తేదేపా ప్రభుత్వ వైఫల్యాలను అస్త్రాలుగా మలచుకుని ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థులను ఓడించిన.. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్న జగన్కు ఇప్పుడు సీఎంగా అతిపెద్ద సమస్య వచ్చిపడింది. ఎన్నికల్లో విజయమైతే సాధించారు గానీ పాలనా పరంగా ముందుకు వెళ్లే దారి కనిపించడం లేదట..! ఏపీలో ఆర్థిక పరిస్థితులు జగన్కు కొరకరాని కొయ్యగా మారాయి. తాను హామీ ఇచ్చిన నవరత్నాలను ఎలా అమలు చేయాలనే దానిపై అధికారులతో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో అప్పుల కుంపటి అనేది జగన్ ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారింది. దానికి కట్టే వడ్డీలే భారీ స్థాయిలో ఉండటంతో పాలనకు ఇబ్బందికరంగా మారిందనే చర్చ జరుగుతోంది.
అప్పులతో సతమతవుతున్న ఏపీ..! కొత్త ప్రభుత్వానికి తలనొప్పిగా ఆర్థిక పరిస్థితి..!!
ఏపీ విభజన అయిదేళ్లు గడిచిపోయింది. 2014లో అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్కు ఊపిరి పోసినట్టు అవుతుందని భావించిన ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు. అయిదేళ్లలో చంద్రబాబు మాత్రం రాష్ట్రాభివృద్ధిపై ఎంత దృష్టి సారించారో రాజకీయంగా విభేదాలు కూడా అంతే పెంచుకుంటూ శత్రవులు పెంచుకున్నారు. వారితో యుద్దం చేస్తూ రాష్ట్రంలో పాలనపై పట్టుకోల్పోయేలా చేసుకున్నారు. ఆ పరిణామం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడిపి చిత్తుగా ఓడిపోయింది. 175 స్థానాలకుగానూ కేవలం 23 స్థానాలు మాత్రమే సాధించదంటే ప్రజలు టీడిపి పట్ల ఎంత వ్యతిరేకత వ్యక్తం చేసారో ఊహించుకోవచ్చు.
తడిసి మోపెడవుతున్న అప్పులు..! కోట్లలో వడ్డీ భారం..!!
గత ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు. ముఖ్యంగా చివరి ఏడాదిలో పసుపు కుంకుమ, పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఒక విడత చెల్లింపు వంటివి అమలు చేయడంతో రాష్ట్రంలో ఖజానా నిండుకుంది. అసలే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం కావడంతో ప్రస్తుతం జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఏపీ విభజన సమయంలో 35వేల కోట్లుగా ఉన్న అప్పులు ఇప్పుడు ఏకంగా 1.25లక్షల కోట్లకు పెరిగిపోయాయి. దీనిపై కట్టే వడ్డీనే 12వేల కోట్లు ఉంటుందని అంచనా. దీంతో గత ప్రభుత్వం చేసిన అప్పులు .. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. వైఎస్సార్ పింఛను పథకం కింద పింఛన్లను 2000 నుంచి 2250కు పెంచుతూ జగన్ తన తొలి సంతకం చేశారు. ఇప్పుడు ఈ పింఛన్లు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికితోడు అప్పుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక సతమతమవ్వాల్సి వస్తోంది.
దిద్దుబాటు చర్యలు..! తెలంగాణకు భవనాలు..!!
మరోవైపు ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దేందుకు జగన్ ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులోభాగంగా హైదరాబాద్లోని ఏపీకి కేటాయించిన భవనాలు తెలంగాణ అప్పగించే విషయం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదో హాట్టాపిక్ంగా మారింది. హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలు తెలంగాణకు అప్పగించేలా ఒప్పందం కుదిరింది. ఏపీ ప్రభుత్వం అమరావతికి తరలివెళ్లిపోవడంతో ఆ భవనలుచాలావరకు వృథాగా పడిఉన్నాయి. కొన్నిభవనాల్లో పాలన కొనసాగుతుండగా.. మరికొన్ని భవనాలు మాత్రం అటు ఏపీకి, ఇటు తెలంగాణకు ఉపయోగపడకుండా పడి ఉన్నాయి.
భవనాల అప్పగింత..! మారుతుందా భవిత..!!
ఏపీ ఉపయోగించుకోకపోగా.. 8కోట్ల రూపాయల పన్ను కట్టాల్సి వస్తోంది. తెలంగాణ సీయం చంద్రశేఖర్ రావు, జగన్ చర్చించుకుని ఆ భవనాలు తెలంగాణకే అప్పగించేలా ఒప్పందం కుదరడంతో.. ఆ భవనాలు తెలంగాణకే కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏపీలో అనవసరంగా నియమించిన కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. సీ.ఎం.ఆర్.ఎఫ్లో పనిచేస్తున్న సుమారు 42 మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా ఆర్థికంగా మెరుగుయ్యేలా దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. మరి ఈ ఆర్థిక సవాళ్లను జగన్ ఎదుర్కొని నవరత్నాలను ప్రజలకు ఏ విధంగా అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.