పోలీసు ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..ఏం చెప్పిందంటే..?
హైదరాబాదు: ఇక నుంచి ప్రతి పోలీస్ ఎన్కౌంటర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదే విషయాన్ని స్థానిక కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. 2009లో హైకోర్టు కూడా ఇదే రకమైన తీర్పును వెలువరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
2009లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్కౌంటర్లపై విచారణ జరపాలని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించాయి. అప్పట్లో నక్సలైట్ల ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఏపీ పోలీస్ యూనిట్ 8 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసింది. పిటిషన్ను విచారణ చేసిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాలని ఆదేశించింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించాయి తెలుగురాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ పోలీస్ అధికారుల సంఘం. అయితే అప్పట్లో స్టే విధించిన సుప్రీంకోర్టు తాజాగా స్టేను కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
కేసు పూర్వాపరాలు చూస్తే... ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహౌండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక దీనిపై పౌరసంఘాలు రిట్ పిటిషన్ దాఖలు చేశాయి.ఆ రిట్ మీద 2009 ఫిబ్రవరి 6న జస్టిస్ గోడ రఘురాం, జస్టిస్ వివిఎస్ రావు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జి భవానీప్రసాద్ ల బెంచి తీర్పు చెప్పింది.ఈ తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయవలసింది. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం వెంటనే ఈ తీర్పును కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. సుప్రీంకోర్టు కూడ తక్షణమే మధ్యంతర ఉత్తర్వుగా ఆ తీర్పు మీద స్టే ఇచ్చి, విచారణను వాయిదా వేసింది.
ఆ విచారణ అలా పది సంవత్సరాలు సాగి ఎట్టకేలకు తీర్పు వెలువరించింది.ఈ కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటిది కాబట్టి, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు విభజిత రాష్ట్రాలకూ వర్తించనుంది.