కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం;ఆటోమొబైల్ షాపు దగ్థం;కావాలనే తగలబెట్టారంటున్నయజమాని
కర్నూలు: కర్నూలు నగరంలో భారీ అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఆటోమొబైల్ షాపు పూర్తిగా దగ్ధం కావడంతో భారీ ఆస్థి నష్టం సంభవించింది. మరోవైపు ఇది అగ్ని ప్రమాదం కాదని, ఎవరో కావాలని తగలబెట్టి ఉంటారని షాపు యజమాని అనుమానం వ్యక్తం చేస్తుండటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే...
కర్నూలులో బాలాజీనగర్కు చెందిన అన్నదమ్ములు ఫయాజ్, రియాజ్ పొట్టి శ్రీరాములు పార్కు ఎదురుగా ఉండే దావూద్ కాంప్లెక్స్లోని రెండు గదుల్లో ఎఫ్.ఆర్.ఆటోమొబైల్స్ షాపు నిర్వహిస్తున్నారు. ఇందులో వీరు టూవీలర్స్ విడిభాగాలతో పాటు ఆయిల్స్ విక్రయించేవారు. రోజు మాదిరిగానే రాత్రి 9.30 గంటలకు షాపును మూసేశారు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో షాపులో నుంచి మంటలు ఎగసి పడుతుండటం చూసి స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. జిల్లా అగ్నిమాపక అధికారి భూపాల్రెడ్డి, సహాయ అధికారి జయన్న సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
అయితే అప్పటికే షాపులోని వాహనాల విడి భాగాలు,ఆయిల్స్, ఇతర వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్తోనే అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు షాపు బంద్ చేయడానికి ముందు తాము మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటామని, ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కారణం కానే కాదని, ఎవరో కావాలనే నిప్పు పెట్టినట్లు బాధితుడు ఫయాజ్ అనుమానం వ్యక్తంచేశారు. ప్రమాదంలో రూ.50 లక్షల దాకా నష్టం వాటిల్లింటుందని ఆయన పేర్కొన్నాడు.