శేషాచలం అడవుల్లో ఎగిసిన మంటలు: స్మగర్ల పనేనా?
చిత్తూరు: జిల్లాలోని శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శేషాచలం అడవుల్లో పలు ప్రాంతాల్లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపకదల సిబ్బందితోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది యత్నిస్తున్నారు.
తలకోన అటవీ ప్రాంతంలో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభమవుతన్నా కారణంగానే మంటలు ఎగసాయా? లేక తమ వద్దకు రాకూడదనే ఉద్దేశంతో ఎర్రచందనం స్మగర్లే అడవులను కాల్చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరంబాడి అటవీ ప్రాంతంతోపాటు కపిలతీర్థం సమీపంలో కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పశువుల కాపర్లు మంచి గడ్డి మొలుస్తుందనే ఆలోచనతో ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. కాగా, అడవికి నిప్పంటించాడనే కారణంగా సాగర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి మృతి
చిత్తూరు జిల్లా కెవిబిపురం మండలంలోని తిమ్మసముద్రం సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాళహస్తి నుంచి కెవిబిపురం వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. వీరు మఠం గ్రామస్తులుగా గుర్తించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.