ఉలిక్కిపడ్డ అనంతపురం జిల్లా: పెన్నా సిమెంట్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
అనంతపురం: అనంతపురం జిల్లా యాడికి మండలంలో నెలకొల్పిన పెన్నా సిమెంట్స్ కర్మాగారంలో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. మండలంలోని బోయరెడ్డి పల్లెలో ఏర్పాటైన ఈ కర్మాగారంలోని బాయిలర్ లో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది బాయిలర్ నిర్వాహణ విభాగం కార్మికులు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పేలుడు ధాటిికి బాాయిలర్ విభాగంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
సిమెంట్ కర్మాాగారాల్లో సాధారణంగా బొగ్గును వేడి చేయడానికి బాయిలర్ ను వినియోగిస్తుంటారు. రాత్రి బాయిలర్ స్థాయికి మించి.. వేడెక్కించడంతో అది ఒక్కసారిగా పేలిందని పోలీసులు వెల్లడించారు. పేలుడు సమయంలో బాయిలర్ నిర్వహణ యూనిట్ లో పలువురు కార్మికులు ఉన్నారు. పేలిన వెంటనే మంటలు చెలరేగాయని, ఆరుమంది కార్మికులు అగ్నికీలల్లో చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సకాలంలో వారిని బయటికి తీసుకుని రావడంతో ప్రాణనష్టం తప్పిందని అన్నారు. సమాాచారం అందుకున్న సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా- పేలుడు చోటు చేసుకున్న సమాచారం తెలుసుకోగానే కార్మికుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో కర్మాగారానికి చేరుకున్నారు. తమ వారి గురించి ఆరా తీశారు. పేలుడు సంభవించిన వెంటనే- సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేశారు. బాయిలర్ విభాగాన్ని మూసివేశారు. మరమ్మత్తులను చేసిన అనంతరం- సోమవారం ఉదయం సిమెంట్ ఉత్పత్తిని పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు కర్మాగార వర్గాల వెల్లడించాయి. కోటి రూపాయలకు పైగా ఆస్తినష్టం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్దారించారు. ప్రమాదానికి ప్రధాన కారణం.. బాయిలర్ ను సామర్థ్యానికి మించి వేడిక్కించడమేనని తెలిపారు.