మంటల్లో ఆంధ్రా బ్యాంక్, బెయిల్ రాలేదని చేతులు కోసుకున్న చిన్నారులు
హైదరాబాద్: గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఆంధ్రా బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో బ్యాంకులో భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో రెండు గంటల నుంచి మంటలను ఆర్పేందుకు అగ్రిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. 13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దగ్ధమయ్యాయని తెలుస్తోంది. మరో వైపు బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకు వద్ద ఉద్రక్తత చోటు చేసుకుంది.
బ్యాంకులోని ఏసీ సిస్టంలో షార్ట్ సర్కూట్ జరగడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెయిల్ రాలేదని చేతులు కోసుకున్న చిన్నారులు
బెయిల్ రాలేదని మనస్థాపంతో చేతులు చిన్నారులు చేతులు కోసుకున్నారు. ఈ సంఘటన తిరుపతిలోని జువైనల్ హోంలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా కడప, నెల్లూరు, తిరుపతికి చెందిన 8 మంది బాలలు తిరుపతిలోని జువైనల్ హోంలో ఉంటున్నారు.
మంగళవారం బెయిల్ రాలేదని వీరంతా చేతులు కోసుకున్నారు. దీంతో వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.