తిరుపతమ్మ తిరునాళ్లలో అగ్నిప్రమాదం,తొక్కిసలాట:తప్పిన ప్రాణనష్టం
కృష్ణా జిల్లా : పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతర సందర్భంగా భక్తుల కోసం దేవస్థానం సమీపంలో వేసిన తాటాకు పందిళ్లలో వంట చేస్తుండగా...వాటి నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడి తాటాకు పందిళ్లు తగలబడటం ప్రారంభించినట్లు తెలిసింది.
ఆ తరువాత మంటలు మరింత విజృంభించడంతో భయభ్రాంతులకు గురైన భక్తులు తప్పించుకునేందుకు ఒక్కసారిగా అటూ ఇటూ పరుగులు దీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయినా ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి రాలేదని, మంటలను అదుపు చేయడానికి ఫైరింజన్లలో నీరు లేవని ఫైర్ సిబ్బంది చెప్పినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.
దీంతో స్థానికులే బిందెలతో నీళ్లు తెచ్చి మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పైగా తిరునాళ్ల ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే తొక్కిసలాట జరిగినా చాలా మందికి స్వల్పగాయాల మినహా ఎటువంటి ప్రాణనష్టం లేదని తెలిసింది. దీంతో ఈ విషయం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.