ఎమ్మెల్యే వంశీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం: పూర్తిగా దగ్ధం
విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యాలయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం షార్ట్సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. విశ్రాంతి గది, అందులోని పలు పత్రాలు, వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఎమ్మెల్యే వంశీ ఛాంబరు పక్కనే ఉండే విశ్రాంతి గదిలో మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ వైరింగ్ పనులు చేశారు.
ఆ తర్వాత విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించి వెళ్లాడు. అయితే, కొద్ది సేపటికి విద్యుదాఘాతంతో ఆ గదిలో మంటలు చెలరేగి ఒక్కసారిగి అంతటా వ్యాపించాయి. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా... ఫైరింజన్ మరమ్మతులకు గురవడంతో ఆలస్యంగా వచ్చింది. విజయవాడ నుంచి మరో ఫైరింజిన్తో వచ్చిన సిబ్బంది.. మంటలను అర్పివేశారు.
అప్పటికే సోఫా, టీవీ, ఏసీ, కంప్యూటర్ ఇతర వస్తువులు పూర్తి కాలిపోయాయి. ఎమ్మెల్యే వంశీ పర్యటనలో ఉండటంతో.. ఏఎంసీ ఛైర్మన్ పొట్లూరి బసవరావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు కలాం, ఎమ్మెల్యే అనుచరులు ఓలుపల్లి మోహనరంగా, కాట్రు శేషుకుమార్ తదితరులు అక్కడకు చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఘటనాస్థలానికి వచ్చారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.