వైసీపీ నేతలపై విరుచుకుపడిన టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్య వాణి.. ఏకిపారేశారుగా !
తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ , ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన నాయకురాలు దివ్య వాణి వైసీపీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు తాజా రాజకీయ పరిణామాల పట్ల ఆమె తనదైన శైలిలో స్పందించారు. దాడులు జరిగిన ప్రతి చోటా కాపలా ఉండలేం కదా అన్న హోం మంత్రి వ్యాఖ్యల మీద , చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించటం మీదా, అలాగే ఎవరి డబ్బు ఎవరు వృధా చేస్తున్నారు అన్న దాని మీదా ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
Recommended Video
ప్రతీచోటా కాపలా ఉండలేమని చేసిన వ్యాఖ్యలతో హోం మంత్రి మహిళ అన్న సంతోషం ఆవిరైంది అన్న దివ్యవాణి
వైసీపీ నేతలపై విరుచుకుపడిన టీడీపీ అధికార ప్రతినిధి దివ్య వాణి.. ఏకిపారేశారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖమంత్రి మేకతోటి సుచరితపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు . ప్రతీచోటా కాపలా ఉండలేమని హోం మంత్రి వ్యాఖ్యానించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శాంతి భద్రతలు కాపాడాల్సిన హోం మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యటం ప్రతీచోటా కాపలా ఉండలేమని అనడం సరికాదంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు . హోంమంత్రే అలా అంటే ప్రజలు ఏమైపోవాలని దివ్య వాణి మంత్రి సుచరితను ప్రశ్నించారు . సుచరిత వ్యాఖ్యలు విన్న తర్వాత మహిళ హోంమంత్రి అయ్యారన్న సంతోషం నెల రోజుల్లోనే ఆవిరైందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు భద్రత తగ్గించింది వాస్తవం కాదా అని నిలదీసిన దివ్యవాణి
ఇక మరోవైపు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత తగ్గించిన విషయం వాస్తవం కాదా? వాస్తవం కాదన్నట్టు ఎందుకు చెప్తున్నారు అని హోంమంత్రిని ప్రశ్నించారు. చెప్పేదొకటి , చేసేది మరొకటి అని మండిపడ్డారు. అధికారుల బదిలీలపై ఉన్న శ్రద్ధ, ప్రజల భద్రతపై కూడా ఉండాలని వైయస్ జగన్ సర్కార్ కు దివ్యవాణి సెటైర్లు వేశారు. అంతటితో ఆగక వైసీపీ నేత రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై నిప్పులు చెరిగారు దివ్య వాణి.
‘ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా అన్న విజయసాయి ట్వీట్ కు ఘాటుగా బదులిచ్చిన దివ్యవాణి
తాజాగా మాజీ మంత్రి నారా లోకేశ్పైన విమర్శలు కురిపించారు విజయసాయి రెడ్డి. ‘ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా లోకేశ్? మీరు, మీ ముఠా సభ్యులు తెగ ఆవేశ పడుతున్నారు. రూ.50 లక్షల విలువ చేయని తాత్కాలిక నిర్మాణానికి రూ.9 కోట్లు దోచుకుతిన్న విషయం బయట పడిందనా మీ ఏడుపులు? కిరాయి మనుషులతో పరామర్శలు, విషాద ఆలాపనలు ఏందయ్యా?' అని ఆయన ప్రశ్నించారు. ఇక ఈ వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ మహిళా నేత దివ్యవాణి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు . ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా వరుస పోస్టులు చేశారు . ప్రజావేదిక హెరిటేజ్ సొమ్ముతో కట్టారా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్కి కౌంటర్ ఇచ్చారు.
కొట్టేయటంలో మీదే పీహెచ్డీ.. అని విజయసాయిని ఏకిపారేసిన దివ్యవాణి
అయ్యా అక్రమ సాయి రెడ్డి గారు అంటూ మొదలుపెట్టిన దివ్యవాణి ఆయన పోస్ట్ కు చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. రంజాన్ పేరుతో 6 వేల మందికి భోజనాలు పెట్టడానికి రూ.1.1 కోట్లు (జి.ఓ-1206), ఈ సొమ్ము సండూర్ పవన్ కంపెనీ సొత్తా? జగన్గారి ఇంటి ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి రూ.5 కోట్లు (జి.ఓ-132), ఈ ఖర్చు భారతి సిమెంట్స్ నుండి ఖర్చు చేసారా? జగన్ నివాసం దగ్గర టాయిలెట్స్ కట్టడానికి రూ.30 లక్షలు (జి.ఓ-133), ఈ సొమ్ము జగతి పబ్లికేషన్స్ నుండి కట్టారా? జగన్గారి ప్యాలస్ దగ్గర బ్యారికేడ్లు పెట్టడానికి రూ.75 లక్షలు (జిఓ-133), ఈ సొమ్ము కార్మెల్ ఏషియా చెల్లించిందా? కొట్టేయడంలో మీరు పీహెచ్డీ చేశారు. మీ రికార్డులు మీరే తిరగరాస్తున్నారు. ఇక మిగిలింది గుడిలో లింగం మాత్రమే అంటూ దివ్యవాణి మండిపడ్డారు. విజయసాయి రెడ్డిని ట్విట్టర్ వేదికగా ఏకిపారేశారు.