కారులో మంటలు: భూమా కొడుక్కి తప్పిన ప్రమాదం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి తనయుడికి బుధవారం తృటిలో ఘోర ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేట వద్ద భూమా నాగిరెడ్డి తనయుడు ప్రయాణిస్తున్న కారులో ఓ సీటు కింద ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అతనితో పాటు మరో ముగ్గురు మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మంటలు గుర్తించిన భూమా కుమారుడు కారును ఆపి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో కారు దగ్ధమైంది. భూమా తనయుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన బేగంపేట పరిసరాల్లో జరిగింది. ప్రమాదానికి గురైన కారు నిసాన్. కారులో మంటలు రావడంతో ఫైరింజన్లకు సమాచారం అందించారు. ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి. అయితే, కారు పూర్తిగా దగ్ధమైపోయింది.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు అయిన భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలో ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ బరిలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి కన్నుమూశారు.