రేణిగుంట ఎయిర్పోర్టులో తప్పిన ఘోర ప్రమాదం: ఇండిగో విమానానికి తప్పిన ముప్పు: వెనక్కి వెళ్లి
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో పెనుముప్పు తృటిలో తప్పింది. ఆ సమయంలో విమానంలో సుమారు 150 మందికి వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ముప్పుు తప్పింది. ల్యాండింగ్ కావాల్సిన విమానం మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. పైలెట్ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పెను ముప్పు సంభవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
విమానాశ్రయం రన్వేపై ఫైరింజన్ బోల్తా పడటమే దీనికి కారణం. విమానం ల్యాండింగ్కు ముందు రన్వేను పరిశీలించడానికి వెళ్లిన ఫైరింజన్ బోల్తా పడింది. రన్వేకు అడ్డంగా పడింది. అదే సమయంలో బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. ఫైరింజన్ బోల్తా పడిన దృశ్యాన్ని చూసిన పైలెట్.. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులను సంప్రదించారు. వారి అనుమతితో విమానాన్ని మళ్లీ బెంగళూరుకు మళ్లించారు.
ప్రస్తుతం ఈ విమానం తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను చేపట్టారు విమానాశ్రయం అధికారులు. బెంగళూరు- తిరుపతి విమానంతో పాటు మరో రెండు ఫ్లైట్ సర్వీసులను కూడా వెనక్కి పంపించినట్లు చెబుతున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. ఫైరింజన్ బోల్తా పడటానికి గల కారణాలపై అధికారులు ఆరా తీశారు. అతి వేగం, రన్వైపై వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల ఫైరింజన్ బోల్తా పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
Recommended Video
దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ ఘటనపై కాస్సేపట్లో రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఫైరింజన్ను తొలగించిన వెంటనే విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తామని అన్నారు. ఈ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన మరో రెండు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఆయిల్ సైతం రన్వేపై పడినట్లు తెలుస్తోంది. వాటిని తొలగించే పనిలో పడ్డారు గ్రౌండ్ స్టాఫ్.