ద్వారంపూడి వ్యాఖ్యలపై ఫైర్..అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన ఏలూరు జనసేన నేతలు
ఏపీలో రాజధాని రగడ కొనసాగుతుంది. జగన్ మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత రాజధాని రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపధ్యంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బండ బూతులు తిట్టారు.
రాయలేనంత పరుష పదజాలంతో దూషించారు. ఇక ఈ నేపధ్యంలో కాకినాడలో జనసేన కార్యకర్తలకు , వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్ళ దాడి చేసుకున్నారు. ఇక తాజాగా పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసైనికులు నిప్పులు చెరుగుతున్నారు. నోరు నీకే ఉందా అంటూ మండిపడుతున్నారు.
ఇక ఈ నేపధ్యంలోనే పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు పాత బస్టాండ్ దగ్గర జనసేన సైనికులు ధర్నా చేశారు. తమ అధినేతపై ద్వారంపూడి చేసిన మాటల దాడిని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి అసభ్య పదజాలంతో పవన్ ను దూషించటం సమంజసం కాదన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ద్వారంపూడి వ్యాఖ్యలను ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ద్వారంపూడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్కు కనువిప్పు కలగాలన్నారు.
ద్వారంపూడి రౌడీలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళుతుంటే జనసేన నేతలు, కార్యకర్తలు, మహిళలపై ద్వారంపూడి తన గూండాలతో దాడులు చేయించారని మండిపడ్దారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అని జనసేన నేతలు ప్రశ్నించారు. జనసేన పార్టీగా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్న వారు ద్వారంపూడి తగిన మూల్యం చెల్లించే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు.