రాళ్లదాడి: ఎర్రచందనం సగ్మర్లపై పోలీసుల కాల్పులు
చిత్తూరు: జిల్లాలోని బాకరాపేట, శేషాచలం అడువుల్లో శుక్రవారం ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు స్మగ్లర్లు గాయపడ్డారు. శేషాచలం కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతం పులిబోను దగ్గర పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా స్మగ్లర్లు పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణాను ఆపడంలేదు. దీంతో పోలీసులు రెండు మూడు రోజులుగా శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన స్మగ్లర్లే శేషాచలం అడవులపై దాడి చేసి... ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తున్నారని పోలీసులు చెప్పారు.
సాధారణ ఎన్నికల సందర్భంగా పోలీసులు స్మగ్లర్లపై దృష్టిపెట్టలేదని, ఈ మధ్య కాలంలో ఎర్రచందనం అక్రమ రవాణా మితిమీరిపోయిందని, ఎన్నికలు, ఫలితాలు అంతా అయిపోయింది కాబట్టి పోలీసులు స్మగ్లర్లపై దృష్టి పెట్టారు. సుమారు 300మంది పోలీసులు బాకరాపేట, రంగంపేట, పీలేరు మండల పరిధిలోని కంభంవారిపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ గాలింపు చేపడుతుండగా చంద్రగిరి మండల పరిధిలోని పులిబోను బావి వద్ద పోలీసులకు సుమారు వందమంది స్మగ్లర్లు, కూలీ ఎదురుపడ్డారు. దీంతో స్మగ్లరు పోలీసులపై రాళ్లదాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు స్మగ్లర్లు గాయపడ్డారు. స్మగ్లర్లు అక్కడి నుంచి పరారవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.