కలకలం: ఇంట్లోకి చొరబడి తుపాకితో కాల్పులు
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏడో వార్డు చిన ఆంజనేయస్వామి గుడికి సమీపంలో ఉన్న వీధిలో మంగళవారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ సంఘట తీవ్ర కలకలం సృష్టించాయి.
ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డు లెక్చరర్ కానూరి స్వామి ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్వామి కుమారుడు శ్రీనివాసు భోజనం చేయడానికి తన అక్క విజయలక్ష్మి పిలవడంతో ఇంటి బయట ఉన్న గోళెం వద్దకు చేతులు కడుక్కొనేందుకు వచ్చాడు.
ఈ సమయంలో ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న అరటిచెట్లు, బావి వెనుక ఉన్న ప్రహరీగోడపై నుంచి సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు దూకి రావడం గమనించాడు. దీంతో ఎవరు నువ్వంటూ ఆ యువకుని పట్టుకునే ప్రయత్నించాడు.
తన వద్ద తుపాకీ ఉందని, దగ్గరకు రావద్దని చెప్పి యువకుడుచేతిలోని తుపాకీని నేలపై పేల్చినట్టు చెబుతున్నారు. మూడు రౌండ్లు తుపాకీతో నేలపై కాల్చిన తర్వాత ఆ యువకుని పట్టుకొనేందుకు తిరిగి ప్రయత్నం చేశారు. ఈ శబ్దం విని పక్కన గదిలో టీవీ చూస్తున్న శ్రీనివాసు అక్క బయటకు వచ్చింది.
సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ గుమ్మళ్ల మధుబాబు, పట్టణ ఎస్ఐలు ఎస్సీహెచ్, కొండలరావు, భగవాన్లు ఘటనా స్దలానికి చేరుకున్నారు. సంఘటనా స్దలంలో ప్లోరింగ్పై ఉన్న తుపాకీ బుల్లెట్ల గుర్తులను పరిశీలించారు.
అక్కడే యువకుడి వదిలేసినట్టుగా చెబుతున్న నాటు తుపాకీని , రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు, మరో బుల్లెట్ కోసం గాలిస్తున్నారు. ఇది కంట్రీమేడ్ గన్ అని సీఐ మధుబాబు చెబుతున్నారు.
కంట్రీమేడ్ గన్ నుంచి ఇత్తడి బుల్లెట్లు ఎలా బయటకు వచ్చాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తుపాకీని పరీక్షించే ప్రయత్నం సీఐ చేశారు. ఘటనా స్దలంలో లభించిన తుపాకీ కాకుండా దుండగులు వేరే తుపాకీని వాడారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.