పవన్ కళ్యాణ్ పర్యటనకు నేడు విరామం...కారణం ఇదే!
శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లాలో పోరాట యాత్ర నిర్వహిస్తున్న జనేన అధినేత పవన్ కల్యాణ్ తన యాత్రకు గురువారం విరామం ప్రకటించారు. భద్రతా సిబ్బంది కొరత కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
తన భద్రతా సిబ్బందిలోని 11 మంది గాయపడడంతో వారిని స్వస్థలానికి పంపినట్లుగా పవన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో గురువారం యాత్రకు విరామం ఇస్తున్నట్లు పవన్ ఆ ప్రకటనలో వెల్లడించారు.
చిత్తూరు జిల్లతో ప్రారంభించి ఆ తరువాత శ్రీకాకుళం జిల్లాలో పోరాట యాత్ర చేస్తూ గత పది రోజులుగా జనసేనాని పవన్కల్యాణ్ తన పర్యటన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన సొంత భద్రతా సిబ్బంది రక్షణలోనే పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన పర్యటన ఆసాంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు కనీస పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేయకపోవంతో సొంత భద్రతా సిబ్బందితోనే జనసేనాని పర్యటన కొనసాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో పవన్ పర్యటన సందర్భంగా వివిధ కారణాల రీత్యా ఆయన భద్రతా బృందంలోని 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని, వారిలో కొందరికి తీవ్ర గాయాలు కూడా అయినట్లు జనసేన పార్టీ శ్రేణులు వెల్లడించాయి. వారు కోలుకోవడానికి గాను సమయం పట్టే పరిస్థితి ఉన్నందున పవన్కల్యాణ్ వారిని తమ తమ స్వస్ధలాలకు పంపుతున్నట్లు పవన్ పేర్కొన్నారు.
ఇలా వెళ్లిన భద్రతా బృందం సభ్యుల స్ధానంలో కొత్త వారు శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉంది. అందు వల్ల అనివార్య పరిస్ధితుల్లో గురువారం యాత్రకు విరామం ప్రకటించినట్లు పవన్ తన ప్రకటనలో వివరించారు. పవన్ పర్యటనలకు జనం తాకిడి ఎక్కువగా ఉండటం...మరోవైపు భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటం కారణాలతో పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ మారు మూల ప్రాంతంలో అతికొద్ది మంది పార్టీ అనుచరులతో కలిసి విడిది చేశారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర తదుపరి షెడ్యూల్ను గురువారం సాయంత్రం ప్రకటిస్తామని పార్టీ శ్రేణులు తెలిపాయి.